సెల్ ఫోన్ ఛార్జింగ్లో ఉన్నప్పుడు ఉపయోగించడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఫోన్ వాడకంపై అజాగ్రత్తగా ఉండటం వల్లే గాయపడటంతో పాటు, ప్రాణాలు కూడా పోతున్నాయి. అయినా జనాల్లో అవగాహన లేకుండా పోతోంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో జరిగింది. సెల్ఫోన్ ఛార్జింగ్లో పెట్టి వీడియో కాల్ మాట్లాడుతుండగా, ఫోన్ పేలి ఓ యువతి చూపును కోల్పోయింది.
తమిళనాడులోని తిరువారూరు జిల్లా నీడామంగళం ముట్టయ్యకొత్తనార్ తందు ప్రాంతానికి చెందిన సుకుమార్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన కుమార్తె ఆర్తి సోమవారం తన తండ్రితో వీడియో కాల్లో మాట్లాడుతోంది. అయితే అకస్మాత్తుగా సెల్ పేలడంతో... ఆ ముక్కలు ఆర్తి కళ్ళలో గుచ్చుకు న్నాయి. చెవిలోకి కూడా వెళ్లాయి. దీంతో కుటుంబీకులు హుటాహుటిన ఆర్తీని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా సెల్ ఫోన్ను ఛార్జింగ్లో పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.