ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు క్షమాపణలు చెప్పారు.. తన వ్యాఖ్యలు తమ మనోభావాలు గాయపరిచాయని ఆందోళన చేస్తున్న విశ్వ బ్రాహ్మణ కులస్తులకు గరికపాటి నరసింహారావు భేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఇంతకూ ఎందుకు క్షమాపణ చెప్పారంటే.. గరికపాటి నరసింహారావు దాదాపు 16 ఏళ్ల క్రితం ఓ ఛానల్‌లో చర్చలో మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణ కులస్తుల గురించి నవ్వుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు.. గురువుకు పంగనామాలు పెట్టారు అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు.


అయితే గరికపాటి నరసింహారావు ప్రవచనాలు యూట్యూబ్‌లో చాలాఫేమస్‌.. ఆయన వ్యాఖ్యలను చాలా మంది ఫాలో అవుతుంటారు.అలా ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల ఇటీవల ఆ వీడియో పై విశ్వబ్రాహ్మణులు అక్కడక్కడా ఆందోళనలు చేస్తున్నారు. గరికపాటి నరసింహారావు వ్యాఖ్యానంతో తమ మనోభావాలు గాయపడ్డాయని చెబుతున్నారు. నిన్న గరికపాటి నరసింహారావు ఓ ప్రవచన కార్యక్రమం కోసం భీమవరం వచ్చారు. ఆయన వచ్చిన విషయం తెలుసుకున్న విశ్వబ్రాహ్మణ సంఘం వారు భీమవరంలో ర్యాలీ నిర్వహించారు.


గరికపాటి నరసింహారావుకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆనంద ఫంక్షన్‌ హాల్‌లో ప్రసంగం కోసం వచ్చిన గరికపాటి... విశ్వబ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. చివరకు పోలీసులు ఇరు పక్షాలతో చర్చలు జరిపారు. ఆ తర్వాత గరికపాటి విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులతో మాట్లాడారు. అది 16 ఏళ్ల క్రితం మాట్లాడిన వీడియో అని.. అందులోనూ తాను తప్పుగా మాట్లాడలేదని.. అయినా సరే.. మీరింతగా బాధపడుతున్నారు కాబట్టి.. తప్పుగా మాట్లాడానని మీరు భావిస్తే  క్షమించాలని చేతులెత్తి నమస్కరించారు. గరికపాటి నరసింహారావు క్షమాపణలతో వివాదం సమసిపోయింది.


తనను అన్ని కులాల వారు ఆదరిస్తేనే పేరు వచ్చిందని.. ప్రభుత్వం కూడా పద్మశ్రీ ఇచ్చిందని గరికపాటి అన్నారు. మీరు బాధపడకపోతే ఇంత మంది వచ్చి ఇలా నన్ను అడగరు కదా.. మీకు బాధ కలిగింది కాబట్టే వచ్చారు. అందువల్ల నేను క్షమాపణ చెబుతున్నానని గరికపాటి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: