ఎందరు పాలకులు వచ్చినా గిరిజనుల బతుకులు మారడం లేదు. కనీస సౌకర్యాలైన విద్య, వైద్యం వారికి ఉండటం లేదు. ఎందరో పాలకులు మాటలు చెప్పినా అమల్లోకి తీసుకురాలేదు. కానీ వైఎస్ జగన్ సర్కారు మాత్రం గిరిజనులకు అండగా నిలిచేలా కనిపిస్తోంది. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయాలు అమలైతే.. వారికి జగన్ దైవసమానుడు అవుతాడంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
ఏపీలోని గిరిజన ప్రాంతాల్లో ఏడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని జగన్ ఆదేశించారు. ఏడు ఐటీడీఏల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అరకు, పాలకొండ, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కేఆర్ పురం, దోర్నాలలో ఏర్పాటుకు సీఎం వైయస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రతిపాదనలు తయారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అంతే కాదు.. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మించాలని నిర్ణయించారు.
ఇక గిరిజనులకు అటవీ భూముల పట్టాలు ఇవ్వడంపై దృష్టిపెట్టాలని జగన్ అన్నారు. ఎస్సీలు, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్ల ఏర్పాటుకు అసెంబ్లీలో బిల్లు పెట్టాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో నాణ్యత ఉండాలని, కనీస సౌకర్యాలపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని ఆదేశించారు.
స్కూళ్లకు సంబంధించి మూడు దశల్లో 9 సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. డిమాండ్ ఉన్న చోట కొత్త హాస్టళ్ల కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. హాస్టల్స్లో వసతుల కోసం కలెక్టర్లకు నిధులు ఇచ్చారా అన్నదానిపై సీఎం వైయస్ జగన్ ఆరా తీశారు. 309 హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 927 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత మంత్రులు, అధికారులకు సూచించారు.