కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశంలో అనేక జిల్లాల్లో లాక్డౌన్ విధించింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం ప్రమాదంలో ఉందని, ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ను ఆయన ప్రకటించారు. ఈ లాక్డౌన్ లక్ష్మణరేఖను ఎవరు కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ దాటవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఈ 21రోజులు మనకు ఎంతో కీలకమని, ప్రజలెవరూ ఇళ్లు దాటి బయటకు రావొద్దని ఆయన కోరారు. ఈ విషయాన్ని దేశప్రధానిగా గాకుండా మీ కుటుంబ సభ్యుడిగా ఇస్తున్న సందేశమని ఆయన పేర్కొన్నారు. ఈ ఒక్క అడుగు కరోనా మహమ్మారిని అంతం చేయడానికి నాంది పలుకుతుందని ఆయన అన్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా వైరస్ బాధితులకు వైద్యసేవలు అందిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు. కరోనా కట్టడికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పకడ్బందీగా పోరాటం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
లాక్డౌన్ అంటే కర్ఫ్యూలాంటిదేనని, ఇది మనల్ని మనం కాపాడుకోవడానికి తీసుకున్న నిర్ణయమని, దీనిని దేశప్రజలందరూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. అన్నికంటే ప్రాణం విలువైనదని, జీవం ఉంటేనే జీవితం ఉంటుందని, ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించాలని ఆయన కోరారు. ఈ మేరకు కరోనా కట్టడికి 15వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రటించారు. అలాగే.. సొంత వైద్యం పనికిరాదని, వైద్యుల సూచనల మేరకే మందులు వాడాలని ప్రజలకు ఆయన సూచించారు. కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్లో క్రమంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 500 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మృతుల సంఖ్య పదికి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్డౌన్ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడంతో పరిస్థితులు ఎంత ప్రమాదకంగ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ సలహాలు,సూచనలను పాటించాలని సూచిస్తున్నారు.