తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికల వేడి మొదలైంది. అధికార మరియు ప్రతిపక్షాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు పలు సమీకరణాలతో బేరీజు వేసుకుంటూ ఎన్నికల హడావుడి మొదలు పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక నియోజక వర్గంలో జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) తన స్థానాన్ని మరోసారి నిలబెట్టుకుంటామని, గతం కంటే మెరుగైన మెజార్టీ ఈ ఎన్నికల్లో సంపాదిస్తామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఉరఫ్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై పలు విమర్శలు ఎక్కుపెట్టారు మంత్రి. బీజేపీ పరిస్థితులు సమాజంలో తక్కువ, సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలు దుబ్బాకలో డిపాజిట్‌లు కోల్పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. కాషాయ పార్టీది డొల్ల ప్రచారమని.. దుబ్బాక గడ్డకు ప్రజా చైతన్యం ఉందని పేర్కొన్నారు. బీజేపీ నేతలు పోలీసులపై మాట్లాడిన భాషను ఖండిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తాము కూడా బూతులు మాట్లాడగలుగుతామని హెచ్చరించారు. తాము మాట్లాడటం మొదలుపెడితే పీఎం, కేంద్ర మంత్రులను సహా ఎవ్వరినీ కూడా వదలిపెట్టేది లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.


ఈ సందర్భంగా బుధవారం నాడు  మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రూ.27,718 కోట్లను వ్యవసాయ రుణమాఫీ చేసినట్టు ఆర్బీఐ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ కి అలాగే మా ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని కొనియాడారు. రైతుబంధు రూపంలో రూ.28 వేల కోట్లు ఇచ్చామని.. రాష్ట్ర జీఎస్‌డీపీలో వ్యవసాయ రంగం కంట్రిబ్యూషన్ రెట్టింపు అయ్యిందని తెలిపారు. తెలంగాణలో తలసరి ఆదాయం అరేళ్లలో రెట్టింపు అయ్యిందని.. దివాళాకోరు ప్రతిపక్షాలు ఆర్బీఐ నివేదికను గుర్తిస్తాయో లేదో చూడాలని అన్నారు. ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు కేసీఆర్‌కు జై కొడుతున్నారని గుర్తుచేశారు. ఏది ఏమైనా ఈ ఎన్నికలకు తెలంగాణలో ఒక రేంజ్లో అధికార మరియు ప్రతిపక్షాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు వరుస ఆరోపణలు చేసుకుంటున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: