గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. ఎలా అయినా గెలిచి తమ సత్తా చాటాలని అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా పోటీ టీఆర్ఎస్ - బీజేపీ మధ్య నెలకొందని చెప్పవచ్చు. దుబ్బాకలో కూడా గెలవడంతో బీజేపీ తామకు ప్రధాన ప్రత్యర్ధి అని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే ఆ అభ్యర్ధులు బలంగా ఉన్నారని భావించిన ప్రదేశాల్లో, అలానే సిట్టింగ్ లు ఉన్న స్థానాలకు సంబంధించిన చోట్ల మంత్రులను రంగంలోకి దింపుతోంది టీఆర్ఎస్. ఈ క్రమంలోనే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బంజారాహిల్స్ డివిజన్ లోని ఎన్బీటీ నగర్ లో నిన్న పాదయాత్ర నిర్వహించారు.
టీఆర్ఎస్ కార్పోరేటర్ అభ్యర్థి గద్వాల్ విజయలక్ష్మి, అల్లోల దివ్యారెడ్డితో కలిసి ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యాక్రమలను వివరిస్తూ టీఆర్ఎస్ కే ఓటు వేయాలని ఆయన ఒక్కొక్కరినీ అభ్యర్థించారు. బంజారాహిల్స్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల్ విజయలక్ష్మి గతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ఈసారి కూడా ప్రజలు ఆ విషయాలు గుర్తుంచుకుని మరో సారి ఆమెను ఆశీర్వదించి ఆమెను గెలిపించాలని కోరారు. అలానే కాంగ్రెస్ , బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపును ఆపలేరని అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఇక మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ప్రజల సమస్యలపై టీఆర్ఎస్ కు ఉన్న బాధ్యత మరే ఇతర పార్టీలకు లేదని చెప్పారు. నీటి పన్ను రద్దు చేయడంతో పాటు సెలూన్లు, దోబీ ఘాట్లు, లాండ్రీలకు ఉచిత కరెంట్ ఇస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేసేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంతదని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీల బూటకపు మాటలను నమ్మే స్థితిలో గ్రేటర్ ప్రజలు లేరని మంత్రి పేర్కొన్నారు.