ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల హీట్ పెరిగింది. పార్టీల్లోకి నేతల జంపింగ్స్ జోరుగా సాగుతున్నాయి. పలాస, రాయదుర్గం మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులుగా గతంలో నామినేషన్ వేసిన కొందరు అభ్యర్థులు వైసీపీలో చేరడం సంచలనంగా మారింది. ఉప సంహరణలు పూర్తయ్యే లోపు మరికొందరు టీడీపీ అభ్యర్థులు వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

ఏపీ వ్యాప్తంగా టీడీపీకి షాకులు తగులుతుండగా.. అత్యంత కీలకమైన విజయవాడ కార్పొరేషన్ లో మాత్రం అధికార పార్టీకి షాక్ తగిలింది. నగరంలోని కీలక నేత వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు బోసు రాజేశ్.  వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. వైసీపీలో బీసీలను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని ఇప్పటికే వైసీపీ నేతలు ఆందోళన చెందుతుండగా.. తాజా ఘటనతో వారంతా మరింత కలవరపడుతున్నారు.

పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్నా తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని బోసు రాజేశ్ ఆరోపించారు.
జగన్ ఓదార్పు యాత్రలో విజయవాడలో జగన్‌తో కండువా కప్పించుకుని..నేటి వరకు పార్టీ కోసం పని చేశానని చెప్పారు. 2014లో టీడీపీ అభ్యర్థి‌పై స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయానని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గం వంగవీటి రాధ వెళ్ళిపోయాక ఇంచార్జిగా మల్లాది విష్ణు వచ్చారు. ఆయన వద్ద కూడా పని చేశానని బోసు తెలిపారు.  తాను ఇదివరకు పోటీ చేసిన వార్డు ఇప్పుడు బీసీ అయింది.. సీటు ఇస్తారనుకున్నా..  ఒక బీసీ అభ్యర్థిగా పోటీలో నిలబడదామనుకున్నా.. నన్ను పక్కన పెట్టి వేరే వారికి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం పని చేసినా గుర్తించలేదన్నారు.
పార్టీలో తనను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని రాజేశ్ ఆరోపించారు.
ఇంకా పార్టీలోనే ఉంటే ఎదుగుదల ఉండదని భావించే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు బోసు రాజేశ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: