విద్యత్ ఛార్జీలకు సంబంధించి ఇప్పటిదాకా పెద్దగా గొడవంటూ చేయని పార్టీ టీడీపీ. ఆ మాటకు వస్తే కమ్యూనిస్టు పార్టీలు కూడా అలానే ఉన్నాయి. ఎవ్వరూ రోడ్డెక్కకుండా సమస్యలు ఎలా తీరుతాయి? అయినప్పటికీ కొంతలోకొంత టీడీపీ మేల్కొని నాలుగు మాటలు చెబుతోంది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరిట వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై చాలా ఆలస్యంగానే లెక్కలు కొన్ని వెలుగులోకి తెచ్చింది. ఇవన్నీ ఆధార సహితంగా ఉన్నాయా అంటే చెప్పలేం. చంద్రబాబు (టీడీపీ అధినేత) చెబుతున్న లెక్కలకూ, అధికార పార్టీని నడిపే నేత వైసీపీ పెద్ద జగన్ చెబుతున్న లెక్కలకూ ఎక్కడా పొంతన అన్నదే లేకుండా ఉంది. దీంతో ఛార్జీల భారం కన్నా విపక్షాల రగడే ఎక్కువగా ఉంది.
ఎలానో చూద్దాం... :
వైసీపీ ప్రభుత్వం సర్దుబాటు చర్యల పేరిట మూడు వేల కోట్లకు పైగా ఈ సెప్టెంబర్ నుంచి ఐదు నెలల పాటు వసూలు చేసేందుకు సంబంధిత సంస్థలకు అనుమతి ఇచ్చింది. డిస్కంలు నష్టంలో ఉన్నాయని, పంపిణీకి, వస్తున్న ఆదాయానికి మధ్య తేడా ఎక్కు వగా ఉందని, దీనిని భరించలేకనే తాము సర్దుబాటు ఛార్జీల పేరిట కొంత ఛార్జీలు పెంచనున్నామని విద్యుత్ సంస్థలు చెప్పాయి. ఇందుకు తగ్గ కారణాలు కూడా డిస్కంలు, అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు చెబుతూనే ఉన్నాయి. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో నలభై నాలుగు పైసలు, మిగతా ప్రాంతాలలో రూపాయి 23 పైసలు చొప్పున వసూలు చేయాలని నిర్ణయించాలి. రానున్న కాలంలో అవ్వాల్సిన మొత్తం వసూలు మూడు వేల కోట్లకు పైనే అని తేలితే, చంద్రబాబు మాత్రం 11వే లకోట్ల రూపాయల భారం ప్రజలపై వేశారని ఎలా చెబుతున్నారు. త్వరలో మరో రెండు వేల కోట్ల భారం వేయాలని భావిస్తున్నా,సీఎం ఇప్పటివరకూ ఎటువంటి అనుమతీ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఈ అంకెలను ఎలా మార్చి ప్రజల ముందు ఉంచుతారు.విద్యుత్ కొనుగోలు, ఉత్పత్తి, ఛార్జీల వసూలు, సంస్థల నిర్వహణ అన్నవి ఎవ్వరు ఎన్ని చెప్పినా పెరిగిపోతున్నాయి. అదేవిధంగా విద్యుత్ వినియోగమే ఊహించని స్థాయిలో ఉంది. వినియోగానికి అనుగుణంగా పంపిణీ లేదు అన్న మాట అనేందుకే లేదు.
నాణ్యమయిన విద్యుత్ ఏపీ ప్రభుత్వం అందించడం లేదన్న ఆరోపణలే లేవు. కానీ డిస్కంలు తమ ఆదాయాన్ని బాగా కోల్పోయాయి అన్నది నిజం. ఈ దశలో ప్రభుత్వం ఆ నిధులను అందించేందుకు సుముఖంగా లేని కారణంగానే ఈ అవస్థలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు ఆందోళన చెందినంత స్థాయిలో విద్యుత్ బిల్లు భారం అయితే లేదు. ఇదే సమయంలో రాష్ట్రం ఇంకాస్త మెరుగయిన స్థితిలో, నాణ్యమయిన విద్యుత్ అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏమయినా ఉంటే అవి వెంటనే పూర్తి చేయగలగాలి. ఉచిత విద్యుత్, మీటర్ల ఏర్పాటుపై రైతుల విషయమై బాబు మాట్లాడకుండా కేవలం సర్దుబాటు ఛార్జీలపై మాత్రమే మాట్లాడుతున్నారు. ఎందుకంటే బీజేపీ కి సంబంధించి మేటర్ విద్యుత్ మీటర్ల ఏర్పాటు కనుక! అంతే అంటారా సర్!