ఇదీ శ్రీకాకుళం లో రగులుతున్న రాజకీయ రగడ. ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో ఎవరికి వారు విడిపోయి, ఎవరి దారి వారు చూసుకుంటూ గోల గోల చేస్తున్నారు. పార్టీ విధించిన క్రమశిక్షణ రేఖను సైతం దాటిపోతున్నారు. ఈ క్రమంలో జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకే పార్టీలో ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. దువ్వాడ తన సహజమైన ఆవేశంతో మాట్లాడుతున్నారు. తన మాట ధిక్కరిస్తే, విప్ ధిక్కరిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని చెబుతున్నారు. ఇలాంటి సినిమా డైలాగులకు తాను భయపడను అన్న రీతిలో తిలక్ ఉన్నారు. ఈ గొడవలో ఎవరిది పై చేయి?
తనని తాను తరుచూ జగన్ భక్తుడిగా చెప్పుకునే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనకు అస్సలు సంబంధమే లేని మండల రాజకీయాల్లో తల దూర్చి కొత్త తలనొప్పులు తెచ్చుకుంటున్నారు. నందిగాం ఎంపీపీ ఎన్నిక విషయ మై అక్కడి వైసీపీ నేత పేరాడ తిలక్ తన మాట నెగ్గాలని తన తరఫు వ్యక్తే గెలవాలని పట్టుబడుతున్నారు. కానీ దువ్వాడ శ్రీను మాత్రం సీన్ లోకి వచ్చి వివాదాన్ని పెంచుతున్నారు.
మొత్తం 16 మంది ఎంపీటీసీలలో 12 మంది కాళింగ సామాజికవర్గంకు చెందిన నేతలే ఎన్నికయ్యారు. మిగిలిన వారిలో కాపు సామాజికవర్గ నేత ఒకరు ఎంపీటీసీగా ఉన్నారని వారికే దువ్వాడ మాట ఇచ్చారని తెలుస్తోంది. దీంతో పేడాడ తిలక్, దువ్వాడ శ్రీను వర్గాల మధ్య వివాదం రేగుతోంది. మఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పేడాడ తిలక్ మధ్య ఆధిపత్య పోరు కారణంగా క్షణానికో రకంగా రాజకీయం రంగు మారుస్తోంది.నందిగాం ఎంపిపి విషయంలో విప్ ధిక్కరిస్తే తిలక్ తో పాటు ఎంపిటిసి లు అందరిని సస్పెండ్ చేస్తామని అంటున్నారు దువ్వాడ. మరోవైపు ఆయన బెదిరింపులకు బెదరనని తన ఇలాకాలో దువ్వాడ పెత్తనం ఏంటని తిలక్ అంటున్నారు. ఈ నేపథ్యంలో అరకు లో తిలక్ వర్గం ఎంపీటీసీలు క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు.