ఈ పాదయాత్రలో షర్మిల పలువురి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అందరినీ పలుకరించడం బాగుందని చర్చించుకుంటున్నారు. అనంతరం షర్మిల మాట్లాడారు. ప్రజల ప్రాణాలు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విలువ లేదన్నారు. కేసీఆర్కు ప్రజలను ప్రేమించే తత్వం లేదని, కరోనాతో ఆర్థికంగా నష్టపోతే ఆదుకునే జాలి కూడా లేదన్నారు. వైఎస్సార్ హయాంలో ఆరోగ్యశ్రీతో ప్రతి కుటుంబం లబ్ధి పొందింది అని గుర్తు చేశారు. తాను చేపడుతున్న పాదయాత్రలో అడుగడుగున లబ్ధి పొందిన కుటుంబాల ఆనంద భాష్పాలు కనిపిస్తున్నాయి అని తెలిపారు. ప్రజలను ప్రేమించే తత్వం లేనప్పుడు రాజకీయాలు చేయొద్దు అని వెల్లడించారు. కరోనా చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చి ఉంటే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడేవి కావు అని పేర్కొన్నారు. కనీసం చనిపోయిన కుటుంబాలను సైతం ఆదుకోలేదు అని, ప్రజలను ఆదుకునే మనసు కేసీఆర్కి లేదన్నారు.
తెలంగాణలో గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడంపై సమగ్ర అవగాహన కల్పించడానికి ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శ్రీకారం చుట్టినదే ఈ పాదయాత్ర. మంగళవారం ఏడో రోజుకు చేరుకున్నది. ఈ నెల 20న షర్మిల రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో పాదయాత్రను వైఎస్ విజయమ్మ ఆరంభం చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 90 అసెంబ్లీ, 14 లోక్సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4వేల కిలోమీటర్ల దూరం ఈ మహా పాదయాత్ర కొనసాగాల్సి ఉంటుందని తెలిపారు. వైఎస్ షర్మిల పాదయాత్రకు ఏడో రోజు మంగళవారం తాత్కాలికంగా బ్రేక్ పడిందని పలువురు పేర్కొంటున్నారు. నిరుద్యోగ నిరాహార దీక్ష దీనికి కారణం పేర్కొంటున్నారు. కొద్దిసేపు అయితే కానీ దీనిపై ఓ క్లారిటీ రాదు.