తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతల పాత్ర ఎటువంటిది అనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే సొమ్ములు మొత్తం ఆయనవే కాబట్టి. ఆయన తర్వాతే మిగతా అందరికీ ప్రాధాన్యం లభిస్తుంటుంది. గొప్ప గొప్ప సినిమాలను తీసిన నిర్మాతలకు కూడా చిరకాల కోరికలుంటాయి. ఫలానా కాంబినేషన్లో తీయాలనో, ఫలానా కథానాయకుడితో తీయాలనో, ఫలానా దర్శకుడితో తీయాలనో, పలు భాషల్లో సినిమాలు నిర్మించాలనో.. ఇలా నిర్మాతలకు డ్రీమ్ ప్రాజెక్టులుంటాయి.
అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న గొప్ప నిర్మాత డి.రామానాయుడు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేతగా ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలను రూపొందించారు. అలాగే దేశంలోని అన్ని భాషల్లో సినిమాలు నిర్మించి ఆయన కోరిక నెరవేర్చుకున్నారు. రామానాయుడు తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన స్థానానికి సరిపడా స్థాయికి చేరుకున్నా, చేరుకోకపోయినా చెలామణి అవుతున్నవారిలో దిల్ రాజు ప్రముఖంగా ఉంటారు. పలు కథానాయకులు, దర్శకుల కాంబినేషన్లో సంచలనచిత్రాలను నిర్మించిన దిల్రాజుకు ఒక కోరిక తీరకుండా ఉండిపోయింది. ఒక అగ్ర కథానాయకుడితో సినిమా నిర్మించాలనే దిల్ రాజు కోరిక ఇప్పటివరకు తీరలేదు. ఆయనకు అది కలలో కూడా వెంటాడుతుంటుందని రాజు సన్నిహితులు చెబుతుంటారు.
ఆ వెంటాడే విషయం ఏమిటంటే అగ్ర కథానాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణతో సినిమా తీయాలని. ఆయనతో సినిమా తీయడమే తన చిరకాల కోరిక అంటూ మనసులో మాటను దిల్రాజు కొన్ని సందర్భాల్లో బయట పెట్టారు. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ సెట్ చేయాలనుకున్నప్పటికీ కుదరలేదు. తర్వాత అనిల్ రావిపూడి-బాలయ్య కాంబినేషన్ నె సెట్ చేయాలని దిల్ రాజు ప్రణాళికలు రచించుకుంటున్నట్లు ఫిల్మవర్గాల సమాచారం. ఏదేమైనప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా బాలయ్యతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్న దిల్ రాజు కోరిక త్వరలోనే నెరవేరనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ దిల్ రాజు తన చిరకాల కోరికను తీర్చుకోవడానికి బాలయ్యను కూడా ఒప్పించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తర్వాత బయటపెట్టవచ్చని అంటున్నారు.