అక్కినేని నాగార్జున, రెజీనా కసాండ్రా కలయికలో ఇప్పుడేమన్నాసినిమా తెరకెక్కుతోందా? వీళ్లిద్దరూ అన్నాచెల్లెళ్లుగా నటిస్తున్నారా? అని ఆశ్చర్యపోమాకండి. నాగార్జున బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్న కళ్యాణ్ జువెలర్స్ కోసం కొత్తగా ఒక యాడ్ చేశారు. అందులో ఆయన చెల్లెలిగా రెజీనా నటించడం విశేషం. కళ్యాణ్ జువెలర్స్ కు నాగార్జున దీర్ఘకాలం నుంచి బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కల్యాణ్ జువెలర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించినప్పటినుంచి అక్కినేని నాగార్జున ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గానే కాక ప్రమోటర్గా కూడా ఉన్నారని అంటారు. అలాగే అమితాబ్, జయ కూడా ఈ ప్రకటనలో కనిపించారు.
బ్యాగ్రౌండ్లో ఎమోషనల్ సాంగ్
ఇంట్లో వివాహం జరుగుతుంటే తన గుండెల మీద అల్లారు ముద్దుగా పెరిగిన చెల్లెలు అత్తారింటికి వెళ్లిపోతోందే అని వేదన చెందే అన్నయ్యగా నాగార్జున నటించారు. బాధపడవద్దు.. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండమని చెప్పే చెల్లెలిగా రెజీనా కనిపించారు.
ఈ ప్రకటన బ్యాగ్రౌండ్లో చెల్లీ.. సిరిమల్లి.. నా చెల్లి సిరిమల్లి.. ఓ గుండెలమీద పెరిగావులే.. బతకాలి నీవు మహారాణివోలే అంటూ ఒక ఎమోషనల్ సాంగ్ పెట్టారు. తాజాగా రూపొందించిన ఈ ప్రకటనలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన సతీమణి జయాబచ్చన్ సైతం కనిపించారు.
రిచ్గా ఉన్న ప్రకటన
అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్ సైతం ఉండటంతో ఈ ప్రకటనను చాలా రిచ్గా తీర్చిదిద్దారు. కళ్యాణ్ జువెలర్స్ ఆరంభం నుంచి ఆ సంస్థతో నాగార్జున కొనసాగుతున్నారు. ఒకరకంగా నాగార్జునవల్లే కల్యాణ్ జువెలర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నిలదొక్కుకోగలిగింది. మొదటి నుంచి నాగ్ ప్రకటనవల్ల ఆ సంస్థకు మంచి ఖ్యాతి వచ్చింది. కల్యాణ్ జువెలర్స్ సంస్థలో ఆయనకు వాటాలున్నాయంటారు. నాగార్జున ఇటీవలే వైల్డ్ డాగ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్న నాగార్జున హిందీలో బ్రహ్మాస్త్రను పూర్తిచేయడంతోపాటు త్వరలోనే బంగర్రాజు చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు.