వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి తన లాజిక్‌తో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆలోచనలో పడేశారు. కేంద్రం విశాఖ స్టీల్‌ను ప్రైవేటు చేయాలనుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా కార్మికులు ఈ విషయంపై పోరాడుతున్నారు. ఈ పోరాటం పీక్ దశలో ఉండగానే కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ అవసరం ఒక్కసారిగా పెరిగింది. ఈ దశలో విశాఖ ఉక్కు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి..రైల్వే సాయంతో దేశం నలుమూలలకూ ప్రాణవాయువు పంపింది. లక్షల మంది ప్రాణాలు కాపాడింది.

అయితే ఇదే వైజాగ్ స్టీల్ ప్రైవేటు పరం అయితే.. ఇలాంటి పరిస్థితి మళ్లీ వస్తే.. ఇంత మందిని కాపాడగలిగేదా అని విజయసాయిరెడ్డి సాక్షాత్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ను అడిగారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్ లో మొదటి దశగా ఏర్పాటు చేసిన 300 పడకల కోవిడ్ కేర్ హాస్పిటల్ ని కేంద్ర స్టీల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి విజయ సాయిరెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయ సాయిరెడ్డి వైజాగ్ స్టీల్ గొప్పదనాన్ని మరోసారి ప్రస్తావించారు. కోవిడ్ కష్టకాలంలో ఆక్సిజన్ ని దేశానికి ఇచ్చి ఎన్నో ప్రాణాలు కాపాడిన ఘ‌న‌త విశాఖ స్టీల్ ప్లాంట్‌దేన‌ని విజ‌య‌సాయిరెడ్డి కొనియాడారు.  

దేశం మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ సంక్షోభంతో కొట్టమిట్టాడుతోన్న సమయంలో నేనున్నానంటూ దేశానికి ప్రాణవాయువు అందించిన ఘనత ఆర్ ఎన్ ఐ ఎల్ ఆధ్వర్యంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ దేనని రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి ప్రశంసించారు. రాష్ట్రానికే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలకు ప్రాణవాయువు అందించి ఎందరో ప్రాణాలను కాపాడిన స్టీల్ ప్లాంట్ ని ప్రతిఒక్కరూ అభినందించి తీరాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటికరించి ఉంటే దేశానికి ఇంత సేవలు అందించగలిగేదా? ఒక్కసారి ఆలోచించాలని కేంద్ర మంత్రిని కోరారు.

ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించాల్సిన సందర్భం కాకపోయినప్పటికీ మరొక్కసారి ఆ నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కోవిడ్ రోగుల చికిత్స కోసం స్టీల్ ప్లాంట్ 1000 పడకల కోసం ప్రణాళిక చేయడం, అందులో భాగంగా మొదటి దశలో 300 పథకాలను పూర్తి చేసి కేంద్ర స్టీల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత ప్రారంభించబడడం ఆనందాన్ని కలిగించందన్నారు విజయసాయిరెడ్డి. మరి విజయసాయి లాజిక్‌ను ధర్మేంద్ర ప్రధాన్ పట్టించుకుంటారా.. వైజాగ్‌ స్టీల్‌పై పునరాలోచిస్తారా.. అబ్బే కష్టమేనంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: