గుత్తా సుమన్ చౌదరి... ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది రాజకీయ, వ్యాపార ప్రముఖులను గజ గజ వణికిస్తున్న పేరు. దొరికింది పేకాట కేసులో అయినా సరే... ఆయన వెనకున్న నేర చరిత్ర చూసి... పోలీసులే ముక్కున వేలేసుకుంటున్నారు. పైకి మాత్రం రియల్టర్‌గా చలామణి అవుతూ... అందరితో ఆహో ఓహో అనిపించుకుంటున్న గుత్తా సుమన్... తెర వెనుక మాత్రం లెక్క లేనన్ని మోసాలు చేశాడు. మంచిరేవుల పేకాట కేసులో అడ్డంగా దొరికిపోయిన గుత్తా సుమన్ చౌదరి ఫోన్‌లో ఎంతో మంది ప్రముఖుల ఫోన్ నెంబర్లు, వారితో తీయించుకున్న ఫోటోలను పోలీసులు గుర్తించారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తు గొలిపే విషయాలు బయటకు వచ్చాయి. అసలు ఓ పేకాట శిబిరం నిర్వాహకుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారించడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదని పోలీసులే చెబుతున్నారంటే... గుత్తా సుమన్ నేర చరిత్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన గుత్తా సుమన్ చౌదరి.... రియల్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ కంపెనీ ముసుగులో అక్రమాలకు పాల్పడ్డారు. ఇక రాజకీయ నాయకుల అండతో పేకాట, క్యాసినో నిర్వహించినట్లు ఆరోపణలు కూడా. విజయవాడలో ఇప్పటికే మూత పడిన అన్నపూర్ణ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ నిర్వహించిన ఏపీ 24X7 న్యూస్ ఛానల్‌లో డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. అదే సమయంలో విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్‌లో తన కుమారుడి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నేతలతో పాటు వ్యాపార ప్రముఖులను ఆహ్వానించారు. ఇక వీటితో పాటు గన్నవరం నియోజకవర్గంలో ప్రతి ఏటా ఎడ్ల పందేలు నిర్వహిస్తారు. వీటికి స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావులను ముఖ్య అతిధులుగా ఆహ్వానిస్తారు కూడా.  అలాగే మంత్రి కొడాలి నానికి అత్యంత ఆప్తుడిని అని చెప్పుకుంటూ ఉంటారు. న్యూస్ ఛానల్ ముసుగులో కూడా అక్రమ దందాలకు గుత్తా సుమన్ పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: