సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మంత్రి జగదీష్ రెడ్డి తన మార్కు చూపించాడు. లక్షలు, కోట్లు దారపొసే సత్తా ఉన్న నాయకులను పక్కకు పెట్టి జనరల్ స్థానంలో ఒక దళిత మహిళను చైర్ పర్సన్ పీఠంపై కూర్చోబెట్టారు . ఎన్నికల ఫలితాలు ముగిసిన్నప్పటి నుండి చైర్ పర్సన్ స్థానాన్ని దక్కించుకునేందుకు ఆశావాహులు అన్ని రకాల ప్రయత్నాలు మొదలు పెట్టారు. అవన్నీ సావధానంగా వింటూనే తన నిర్ణయాన్ని అత్యంత రహస్యంగా ఉంచిన మంత్రి , చివరకు చైర్ పర్సన్ అభ్యర్థిని అన్నపూర్ణ ను ప్రకటించారు.
చైర్ పర్సన్ గా తన ఎన్నిక విషయం తెలియక పోవడంతో కౌన్సెలర్ అయితే చాలు అనుకున్న అన్నపూర్ణ ఏకంగా చైర్ పర్సన్ అయింది . చైర్ పర్సన్ ఎన్నికైన అన్నపూర్ణ ఆనందంతో కన్నీరు కారుస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. అన్నపూర్ణ మొదటి నుండి జగదీష్ రెడ్డి వెంట ఉండి నేటి వరకు ఆయన అనుచరురాలిగానే కొనసాగుతున్నారు . ఈ ఒక్క నిర్ణయం తో మంత్రి సూర్యాపేట పట్టణాన్ని అభివృద్ధిలో తీర్చి దిద్దటం తో పాటు రాజకీయ ధనస్వామ్యాన్ని ప్రక్షాళన చేసేందుకు కంకణం కట్టుకున్నారని స్పష్టం అవుతుందని టీఆరెస్ నేతలు అంటున్నారు .
దళిత మహిళను సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పీఠం పై కూర్చోబెట్టడం పట్ల ప్రజలు కూడా జగదీష్ రెడ్డిని అభినందిస్తున్నారు. రాజకీయాల్లో జనరల్ స్థానాల్లో ఇతర సామాజిక వర్గాలకు బహు అరుదుగా పార్టీ అమాత్యులు అవకాశం కల్పిస్తుంటారు . జనరల్ స్థానాలను అగ్ర వర్గాలకు చెందిన వారే ఎక్కువ ఆశించడం , వారిని అమాత్యులు కూడా కాదనలేకపోవడం జరుగుతుంటుంది . కానీ సూర్యాపేట వంటి పెద్ద మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎంపిక లో మాత్రం జగదీష్ రెడ్డి తనదైన మార్క్ ప్రదర్శించి అందరి చేత అభినందనలు అందుకుంటున్నారు .