ఎడారి ప్రాంతాన్ని తలపించిన ఆ ఊరిలో ధైర్యంగా ఇళ్లను కట్టుకుంటారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఇంతకీ ఆ వూరు ఎక్కడుందంటే.. దుబాయ్లో ఒక మారుమూల ప్రాంతం అది. ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడి వాతావరణం పూర్తిగా భిన్నం. ఇంటర్నెట్ పుణ్యమాని ప్రపంచం ఒక చిన్న గ్రామంగా మారిపోవటం వల్ల, ఈ గ్రామం ఫొటోలు అందరికీ చేరుతున్నాయి. దీంతో టూరిస్టులు ఆ ఊరిని చూడటానికి క్యూ కడుతున్నారు. ఆ ఊరు పేరు అల్ మదామ్.
అల్ మదామ్ ఊరుని దుబాయ్ సిటీ నుంచి షార్జాకి వెళ్లే దారిలో బోర్డర్ పక్కన చూడొచ్చు. పేరెంత వెరైటీగా ఉందో… ఊరు కూడా అంతే విచిత్రంగా అనిపిస్తుంది. ప్రతి ఇల్లూ ఇసుకతో నిండిపోయింది. కిటికీలు, దర్వాజాల నుంచి ఇంట్లోకి అలల మాదిరిగా ఇసుక కొట్టుకొచ్చినట్లు, సామాన్లని బయటికి నెట్టుకొచ్చినట్లు కనిపిస్తుంది. ఊళ్లోని ఇళ్లు రెండు వరుసల్లో ఉంటాయి. వాటి మధ్యలో రోడ్డు. ఇళ్లకు కొద్ది దూరంలో కనిపించే మసీదు.. విధి ఆ ఊరును ఎలా వెక్కిరించిందో చెప్పటానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
ఈ ఊరిలో ఏ ఇంటికీ తలుపులు వుండవు. ఒక్క ఇంటికీ కిటికీ కనిపించదు. ఒక వేళ ఉన్నా వాటిని మూసిన పాపాన పోలేదు. ఏదో కనిపించని శక్తి, జనాన్ని ఇళ్లల్లో నుంచి తరిమితే… వాళ్లు భయంతో పరుగులు తీసినట్లు ఆనవాలు కనబడుతున్నాయి. థ్రిల్ కావాలనుకునే విజిటర్లు అల్ మదామ్ విలేజ్కి పెద్ద సంఖ్యలో వచ్చి చూసిపోతున్నారు. ఆ ఫీలింగ్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.. ఇంకా దానిమీద పెద్ద పెద్ద ఆర్టికల్స్ సోషల్ మీడియాలో తెగ పోస్ట్ చేస్తున్నారు.
అల్ మదామ్ ఊరును చూడటానికి అన్ని ప్రాంతాల నుంచి పబ్లిక్ వస్తుంటారు. దాన్నో టూరిస్ట్ ప్లేస్లా డెవలప్ చేద్దామనే ఆలోచన మాత్రం లోకల్ ఆఫీసర్లకు రావట్లేదు. పాపులారిటీని పైసల రూపంలోకి మార్చుకోవాలనే ఆసక్తి దుబాయ్ ప్రభుత్వానికీ లేనట్లు కనిపిస్తోంది. అలా అని అక్కడికి వెళ్లేవాళ్లను ఆపే ప్రయత్నమూ చేయట్లేదు. ఆ గ్రామం ఎందుకలా ఎడారిలా అయిందో చెప్పే సరైన సమాచారం ఎవరి దగ్గరా లేకపోవడం దురదృష్టకరం.