అయ్యయ్యో.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు సీఎం కేసీఆర్ క్లాస్ పీకారా..? అసెంబ్లీ ఎర్రబెల్లి మాట్లాడిన తీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారా..? అంటే గులాబీ శ్రేణులు మాత్రం లోలోపల ఔననే అంటున్నాయి. ఇంతకీ మంత్రి ఎర్రబెల్లికి సీఎం కేసీఆర్ క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందని అనుకుంటున్నారా..? అయితే... సూటిగా ఇక ఆ వివరాల్లోకే వెళ్దాం. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొద్దిరోజులుగా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పించారనీ, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేవని సర్కార్ దవాఖానల్లో పరిస్థితి అధ్వానంగా ఉందని, అంత ఎక్కువ ఖర్చుచేసి యాదాద్రి పవర్ప్లాంట్ నిర్మించాల్సిన అవసరంలేదని, కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి కూడా అంతేస్థాయిలో ఎదురుదాడి చేశారు.
అయితే.. రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని, ఆయన ప్రజల్లో తిరుగుతున్నాడో, రోడ్లపై తిరుగుతున్నాడో అర్థంకావడం లేదన్నారు. * నాతోరా.. ఏ జిల్లాకంటే ఆ జిల్లాకు పోదాం.. ఇవే మాటలు అక్కడ మాట్లాడితే జనం నిన్ను ఉర్కిచ్చి కొడతరు* అని ఎర్రబెల్లి మండిపడ్డారు. ఇక ఇక్కడే రాగోపాల్రెడ్డి కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎర్రబెల్లీ.. ఎక్కడ ఉన్నావంటూ మండిపడ్డారు. ఉద్యమద్రోహులకు మంత్రిపదవులు దక్కాయంటూ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఇరుకున పడిపోయారని, ఈ సమయంలో ప్రభుత్వం మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని, ఎర్రబెల్లి కొంత సంయమనం పాటించి ఉంటే బాగుండని, అనవసరమైన చర్చకు తావు ఇచ్చారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నారు. ఆ రోజు అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత ప్రత్యేకంగా ఎర్రబెల్లిని సీఎం కేసీఆర్ పిలుపించుకుని క్లాస్ తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోసారి అసెంబ్లీలో జాగ్రత్తగా మాట్లాడాలని, అవసరమైతే సాధ్యమైనంత వరకు సైలెంట్గా ఉండేందుకే ప్రయత్నం చేయాలని గట్టిగా మందలించినట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన స్థానిక, మున్సిపల్, సహకార ఎన్నికల్లో ఉమ్మ డి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్కు తిరుగులేని ఏకపక్ష విజయాలు అందించి, తెలంగాణలోనే టాప్ మంత్రిగా ఉన్న ఎర్రబెల్లికి, సీఎం కేసీఆర్ క్లాస్ తీసుకోవడం పార్టీవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. గతం మరిచిపోయి మాట్లాడితే.. ఇలాగే ఉంటుందని పలువురు నాయకులు ఎర్రబెల్లికి చాటుమాటుగా చురకలు అంటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.