తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఎన్ని ముందస్తు చర్యలు చేపడుతున్న.. ఎన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తేస్తున్నప్పటికీ కరోనా వైరస్ ప్రభావం మాత్రం రోజురోజుకూ పెరిగిపోతునే ఉంది . అయితే రోజురోజుకు భారీ సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వారందరినీ ఐసోలేషన్ లో నుంచి ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు... తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది కరోనా వైరస్ మహమ్మారిని జయించి పూర్తిగా కోలుకున్న విషయం తెలుసిందే.
ఇక కరోనా వైరస్ నుంచి కోలుకున్న వాళ్లు తమ అనుభవాలను ప్రజలతో పంచుకునే ప్రజల్లో కాస్త ధైర్యం నింపుతున్నారు. కరోనా వైరస్ సోకిన సమయంలో తాము చేసుకున్న చికిత్స... ఎదురైన అనుభవాలను గురించి అందరితో పంచుకుని అవగాహన కల్పిస్తున్నారు. అయితే తాజాగా కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతూ కోలుకున్నాడు విజయవాడకు చెందిన యువకుడు. విజయవాడ జిజిహెచ్ నుండి డిశ్చార్జ్ అయిన హేమంత్ ను కృష్ణా జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్ అభినందించారు. ఇక అతనికి మంచి చికిత్స అందించిన ఆస్పత్రి సిబ్బందిని కూడా ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా కరోనా వైరస్ సోకిన తరువాత చికిత్స పొందుతూ ప్రాణాంతకమైన మహమ్మారిని జయించిన హేమంత్ అనే యువకుడు మీడియాతో మాట్లాడుతూ... ఎవరైనా ప్రాణాంతకమైన కరోనా వైరస్ జయించవచ్చు అంటూ అందరిలో ధైర్యాన్ని నింపాడు. కరోనా వైరస్ కు మెడిసిన్ లేకపోయినప్పటికీ వ్యాక్సినేషన్ ఉంది అని... ఎవరూ భయపడాల్సిన పని లేదు అంటూ హేమంత్ అన్నాడు. లోపల ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా అందించారు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ కరోనా వైరస్ బారిన పడిన తర్వాత పేషెంట్ కు భయం ఉండడం సహజమే అని.. కానీ డాక్టర్లు మాత్రం చాలా బాగా ట్రీట్ మెంట్ ఇచ్చారు అంటూ హేమంత్ తెలిపాడు. కరోనా వైరస్ సోకడం తప్పుకాదని... ఎవరూ దీని గురించి భయపడాల్సిన పని లేదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ మహమ్మారి వైరస్ కమ్యూనిటీకి సోకకుండా అందరం కలిసి నడుద్దాం అంటూ హేమంత్ పిలుపునిచ్చాడు.