తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . ప్రగతిభవన్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశం లో సీఎం కెసిఆర్ ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు . ప్రత్యేకించి రైతు దీక్ష చేపట్టిన కాంగ్రెస్ నేతలపై ఒంటికాలిపై లేచారు . కాంగ్రెస్ నేతలనుద్దేశించి సన్నాసులు ...దద్దమ్మలు ..బఫున్లు అంటూ కెసిఆర్ విరుచుకుపడ్డారు . ఉత్తమ్ కూడా తానేమి తక్కువ తినలేదని అదేస్థాయి లో కౌంటర్ ఇచ్చారు . కేసీఆర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు .
తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదన్న ఆయన , కేసీఆర్ మాట్లాడిన తీరు కాంగ్రెస్ పార్టీని అవమానించినట్లు భావిస్తున్నానని చెప్పారు . కేసీఆర్ తిట్టిన తిట్లు- తనని వ్యక్తిగతంగా తిట్టినట్లుగానే భావిస్తున్నానని అన్నారు . అసెంబ్లీ సాక్షిగా పరాసిట్ మాల్ టాబ్లెట్ తో పోతుందన్న వాళ్ళను దద్దమ్మ అనాలా? బఫున్ అనాలా? అని ప్రశ్నించారు . పాస్ పోట్ల బ్రోకర్ ఎవరో రాష్ట్రం ప్రజలు మర్చిపోలేదన్న ఆయన , మార్చ్ నెలలో కాంట్రాక్టర్లకు నిధులు ఇచ్చి-ప్రభుత్వ ఉద్యోగులకు-పెన్షనర్స్ కి కోత విధించలేదా? అంటూ ప్రశ్నించారు . కేసీఆర్ అండ్ ఫ్యామిలీ దోచుకోవడానికి తెలంగాణ వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకుండా ఓట్లు అడిగిన వాళ్ళని సన్నాసులు-దద్దమ్మలు అనాలా? అంటూ ఉత్తమ్ ప్రశ్నించారు . ముఖ్యమంత్రి కెసిఆర్ విమర్శలకు ధీటుగా ఉత్తమ్ స్పందించడంతో తెలంగాణ లో ఒక్కసారిగా రాజకీయవేడి రాజుకుంది . అధికార టీఆరెస్ , కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం షురువయింది . కెసిఆర్ , కాంగ్రెస్ నేతలనుద్దేశించి చేసిన విమర్శలపై కాంగ్రెస్ నేతలు ఎవరికివారే వేర్వేరుగా స్పందిస్తూ ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు .