ఈ మధ్యనే కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. వారెవా.. వాటే లైఫ్ అనుకుంటున్నారు కదా.. ఇంత హాయిగా ఉండే వీరి జీవితాల్లో మూడ భక్తి నరకంలా ప్రవేశించింది. ఎంత దారుణం అంటే.. మంత్ర తంత్రాలకు అలవాటుపడిన తల్లిదండ్రులు.. పూజలు, హోమాలు చేస్తూ..ఆ పూజల మత్తులో ఇద్దరు కుమార్తెలను బలి ఇచ్చేశారు. పెంచిన చేతులోనే చంపేశారు.. ఓ కుమార్తెను శూలంతో పొడిచి చంపారు. మరో కుమార్తెను డంబెల్తో కొట్టి చంపేశారు.
వినడానికి ఏమాత్రం నమ్మశక్యంగా లేని ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్లో ఆదివారం రాత్రి వెలుగు చూసింది. క్షుద్రపూజల కారణంగా తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలను కొట్టి చంపేశారు. మళ్లీ బతికి వస్తారని వారు నమ్మడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి అవాక్కయ్యారు.
ఈ ఘటనపై డీఎస్పీ మనోహరాచారి మాట్లాడుతూ.. హత్యకు గురైనవారు, హంతకులంతా పూర్తిగా దైవభక్తిలో లీనమైపోయారని తెలిపారు. తమ బిడ్డలు మళ్లీ బతుకుతారనే నమ్మకంతో చంపేసినట్లు ప్రాథమికంగా తెలిందని డీఎస్పీ చెప్పారు. యువతుల తల్లి పద్మజ బిడ్డలను కొట్టి చంపినట్లు తెలిపారు. తల్లి చంపేటప్పుడు తండ్రి పురుషోత్తంనాయుడు కూడా అక్కడే ఉన్నాడట. ఆదివారం రాత్రి ఇంట్లో పూజలు నిర్వహించి కూతుర్లను చంపేసి.. ఆ విషయాన్ని పురుషోత్తం నాయుడు తాను పనిచేసే కళాశాలలో ఓ అధ్యాపకుడికి చెప్పాడట. ఆయన పోలీసులకు చెప్పడంతో విషయం వెలుగు చూసింది.