దుర్గగుడి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏసీబీ అధికారులు మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. జిల్లా ఏసీబీ అధికారులే కాకుండా గుంటూరు జిల్లా నుంచి కూడా మరికొంతమంది అధికారులను రప్పించి అన్ని విభాగాల్లోనూ సోదాలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో జరిగిన అనేక అవకతవకలను ఏసీబీ అధికారులు గుర్తించారనే వార్తలు వినిపిస్తుండటంతో దుర్గగుడి ఉద్యోగులు, అధికారుల్లో వణుకుపుడుతోంది. ఏడాదిన్నరగా ఇంద్రకీలాద్రిపై వెలుగుచూస్తున్న అవినీతి, అక్రమాలు, వివాదాలన్నింటికీ ఈవో సురేశ్బాబే కేంద్ర బిందువు. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అండతోనే ఇష్టారాజ్యంగా ఆయన చెలరేగిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా దుర్గగుడిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ 13 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయడంపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. దుర్గగుడి అవినీతి విచారణతో అంత మందిని సస్పెండ్ చేసి అసలు సామ్రాట్ను వదలడం స్వామి వారి ఆశీస్సులతోనేనా? అని ప్రశ్నించారు. ఈ దెబ్బతో స్వామి వారి గొప్పదనం రాష్ట్రమంతా పాకిందన్నారు. ఇక అవినీతిపరులంతా స్వామీజీని ఆశ్రయిస్తారేమో చూడాలని వ్యాఖ్యానించారు. అధర్మం రాష్ట్రంలో విజయపధంలో నడుస్తుందిగా? అంటూ వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.