తెలుగు చిత్రాల్లో సంగీత ఉపాధ్యాయుడిగా, ఆలయ పూజారిగా..సంస్కృతీ సంప్రదాయాలకు గౌరవమిచ్చే తండ్రిపాత్ర అనగానే అందరికీ స్వర్గీయ సోమయాజులు గారు కళ్లలో మెదలాడుతుంటారు. అంతలా ఆయన తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా తన నటనతో ప్రభావం చేశారు. 150 సినిమాల్లో నటించినా, టివి సీరియల్స్లో కూడా ఎన్నో పాత్రలు ధరించాడు. నాటక, సినిమా, టివి రంగాలకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన ఘనుడాయన. చివరి శ్వాసవరకు నటన మీద గౌరవంతో ఆరాధనాభావంతో ఉండేవారు. చివరిదశలో ఆరోగ్యం సహకరించకపోయినా చేయగలిగినంత చేశాడు. కళాకారుడు కడవరకు కళాకారుడేనని సోదాహరణంగా నిరూపించాడు. ఇతను రిటైరయ్యేనాటికి సాంస్కృతిక విభాగంలో డైరెక్టరుగా పనిచేసేవాడు. 2004 ఏప్రిల్ 27వ తేదీన ఈ లోకంనుండి నిష్క్రమించాడు.
జె.వి.సోమయజులు 1928 జూన్ 30 వ తెదీన శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం లుకలాం గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు శారదాంబ, వెంకటశివరావు లు. సోమయాజులు విజయంనగరంలో చదువుకొన్నప్పటినుండి నాటకాలు వేసేవాడు. తన సోదరుడు రమణమూర్తితో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 సార్లు ప్రదర్శనలు ఇవ్వడం గమనార్హం.ముఖ్యంగా కన్యాశుల్కంలో "రామప్ప పంతులు" పాత్రకు ప్రసిద్ధుడయ్యాడు. ఉద్యోగరీత్య ఆయన రెవిన్యూశాఖలో పనిచేస్తునే చిత్రసీమలో నిలదొక్కుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ డిప్యూటీ కలెక్టర్ స్థాయికి చేరుకున్నారు. మహబూబ్నగర్లో డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రోజులలోనే ఆయనకు శంకరాభరణం సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
ఈ సినిమాకు ముందే దర్శకుడు యోగి రూపొందించిన 'రాధాకృష్ణయ్య' సినిమాలో ఓ ముఖ్య పాత్రను ధరించారు. ఇది మంచి చిత్రంగా పేరుగాంచినా, ఆర్థికంగా విజయవంతం కాలేదు. శంకరాభరణం సినిమాలోని శంకరశాస్త్రి పాత్ర ద్వారా ఆయన ఎంతో పేరు, ప్రఖ్యాతులు గడించారు. దీనితర్వాత 150 సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయినప్పటికీ, ఇప్పటికీ సోమయాజులు గారికి చిరస్థాయిగా మిగిలిన చిత్రం శంకరాభరణమే. త్యాగయ్య వంటి సినిమాలో ఆయన ముఖ్యపాత్ర పోషించినా, ఈ చిత్రం రాణింపుకు రాలేదు. అలాగే 'సప్తపది'కూడా ఆయన ప్రతిభకు గుర్తింపు తీసుకురాలేదు. 'వంశవృక్షం' సినిమాకూ మంచి గుర్తింపు తెచ్చిపెట్టలేదు.
శంకరాభరణం విజయవంతమైన తర్వాత, రెవిన్యూ సర్వీసులో డిప్యూటీ కలెక్టర్ హోదాలో పదవీ బాధ్యతల్ని నిర్వహిస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా సినిమాల్లో నటిస్తున్నారని, ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన పరిశీలించి, సాంస్కృతిక శాఖను ఏర్పరచి ఆ శాఖకు తొలి డైరెక్టర్గా సోమయాజులును నియమించారు.1984లో ఎన్.టి.రామారావు ప్రభుత్వం 55ఏళ్ళు నిండిన ప్రభుత్వోద్యోగులపై పదవీ విరమణ వేటు వేసింది. ఆ వేటుకి గాయపడిన వారిలో సోమయాజులు కూడా ఉన్నారు. రాష్ట్ర సాంస్కృతిక డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేసిన ఈ కళాకారుడిని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవించింది. అక్కడి రంగస్థల కళల శాఖకు సోమయాజులు అధిపతిగా నియమితులయ్యారు. ఈ క్రమంలోనే 1993 మార్చి 8వ తేదీన రసరంజని నాటక కళాసంస్థను నెలకొల్పారు. ప్రతిరోజూ నాటకాన్ని ప్రదర్శించాలనీ, టికెట్ కొని నాటకాన్ని చూసే ఆదర్శాన్ని పెంపొందించాలనే సదాశయంతో రసరంజని స్థాపన జరిగింది. హైదరాబాద్లో నాటకరంగ వికాసానికి ఈ సంస్థ ఎంతో కృషి చేసింది.