తొందరలో వస్తుందని అనుకుంటున్న నరసాపురం పార్లమెంటు ఉపఎన్నికలో వైసీపీ తరపున ఎవరు పోటీచేస్తారు ? ఇపుడీ విషయంపైనే మెయిన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది. ఒకవేళ వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజీనామా చేస్తే ఉపఎన్నిక ఖాయమే. అయితే రఘురాజు రాజీనామా చేస్తారా ? అనేదే డౌటు. ఎందుకంటే రాజీనామా చేసింత సీన్ ఆయనలో కనబడటంలేదు. అలాగే తిరిగి గెలవటం కూడా ఆయన అనుకుంటున్నత వీజీ కూడా కాదు.




తాను రాజీనామా చేసి మళ్ళీ ఉపఎన్నికలో పోటీచేస్తే ఓట్లన్నీ తనకే వచ్చి పడిపోతాయనే భ్రమలో ఉన్నట్లున్నారు. కానీ క్షేత్రస్ధాయిలో రఘురాజుకు అంత సీన్ లేదని సమాచారం. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేశారు కాబట్టే గెలిచారు. అదే ఇంకో పార్టీ అయ్యుంటే గెలుపు దక్కేదే కాదు. కానీ జగన్మోహన్ రెడ్డితో చెడిన కారణంగా నోటికొచ్చినట్లు ఏదేదో మాట్లాడేస్తున్నారు. సరే ఇక విషయానికి వస్తే ఒకవేళ ఉపఎన్నిక వస్తే వైసీపీ తరపున రెండుపేర్లను జగన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.




మొదటి పేరేమో గోకరాజు రంగరాజు. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కొడుకు. వీళ్ళ ఫ్యామిలీకి నియోజకవర్గంలో మంచి పట్టుంది. రంగరాజుకు బాగా సౌమ్యుడని పేరు. వైసీపీ వచ్చిన కొత్తల్లోనే మాజీ ఎంపీ కొడుకులిద్దరు పార్టీలో చేరారు. వాళ్ళకు ఎలాంటి పదవి ఇవ్వకపోయినా పార్టీలోనే కంటిన్యు అవుతున్నారు. రంగరాజుకు గనుక జగన్ టికెట్ ఇస్తే వాళ్ళ సామాజికవర్గంలో రఘురాజు తరపున మద్దతుగా నిలబడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. పైగా వీళ్ళకు ఇతర సామాజికవర్గాల్లో కూడా మంచిపేరే ఉంది. కాబట్టి గెలుపు ఖాయమనే అనుకుంటున్నారు.




అలాగే రెండో పేరు ఐఏఎస్ రిటైర్డ్ అధికారి  ఎంజీవీకే భాను. తాడేపల్లిగూడెంకు చెందిన ఈయన కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు బాగా సన్నిహితుడు.  భానుతో పాటు కాపుల్లో గట్టి నేతల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. గోకరాజు రంగరాజు అభ్యర్ధి అయితే అడ్వాంటేజ్ ఏమిటంటే క్షత్రియుల్లో అత్యధికులు, ఇతర సామాజికవర్గాల్లో మెజారిటి ఓట్లు వైసీపీకే పడే అవకాశం ఉంది. ఉపఎన్నిక వస్తే రఘురాజు ఏ పార్టీ తరపున పోటీచేస్తారో కూడా క్లారిటి లేదు. కాబట్టి మెజారిటి ఓటర్లు వైసీపీ వేపే మొగ్గుచూపే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: