ఏపీ రాజకీయాల్లో ఇటీవల జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ పేరు ఎక్కువగా వినిపించింది. ప్లీనరీ సమయంలో ఆమె పార్టీని వీడుతున్నానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. సొంత తల్లినే పార్టీనుంచి పంపించి వేస్తున్నారంటూ జగన్ పై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేసింది. ఇక ఇప్పుడు జగన్ సతీమణి భారతి పేరుని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇటీవల వైఎస్ భారతిపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ ని విమర్శిస్తున్న నేపథ్యంలో ఆమె, భారతిపై కూడా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అయితే వైసీపీనుంచి గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. భారతమ్మ అంటే టీడీపీ నేతలకు భయం అని అన్నారు వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత.

సీఎం జగన్ సతీమణి భారతమ్మ గురించి మాట్లాడే హక్కు వంగలపూడి అనితకు లేదని అన్నారు వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత. మహిళలను నమ్మించి టీడీపీ మోసం చేసిందని మండిపడ్డారు సునీత. వంగలపూడి అనిత కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. భారతి అంటే అనితకు భయం ఉండటం సహజం అని చెప్పారు. అందుకే చంద్రబాబు ఆమెపై ఇలా మాట్లాడిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు పోతుల సునీత.

టీడీపీ నేతలు భారతమ్మను చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ పోతుల సునీత. చిన్న వయసులోనే సమర్థుడైన సీఎంగా జగన్ పేరు తెచ్చుకున్నారని, చిన్న వయసులోనే ఆయనకు ఇంత మంచి పేరు రావడం చూసి టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు సునీత. తమ ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నందుకే టీడీపీ నేతలు కుళ్లుకుంటున్నారని అన్నారు సునీత. కేంద్రం నుంచి వచ్చిన నిధులతోపాటు, రాష్ట్ర ఆదాయాన్ని కూడా పేద ప్రజల కోసమే జగన్ ఖర్చు చేస్తున్నారని వివరించారు సునీత. తప్పుడు మాటలు మాట్లాడితే ఏపీ ప్రజలు సహించరని, ఆ విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.


మరింత సమాచారం తెలుసుకోండి: