తెలంగాణలో ఆయన చాలా సీనియర్ లీడర్.. మాజీ మంత్రి కూడా..! అప్పట్లో ఓ వెలుగు వెలిగారు..! ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు.. ఆ తర్వాత స్వరాష్ట్రంలో గులాబీ పార్టీ ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వంలో కూడా మంత్రి పదవి కూడా దక్కింది. పదవి ఉన్నంతకాలం ఆయన పనేదో ఆయన చేసుకుంటూ వెళ్లారు. అయితే.. ప్రజలతో ఆయనకంటే ఆయన తనయుడు ఎక్కువగా మమేకం అయ్యేందుకు ప్రయత్నం చేశారు. పదవి తండ్రిది.. నిర్ణయాధికారం మాత్రం కొడుకు చేతిలో ఉండడంతో అంతా ఆగానికి వచ్చింది. తనయుడి వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. అది చివరికి రాజకీయ భవిష్యత్ను ప్రశ్నార్థకం చేసింది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ప్రజలు షాక్ ఇవ్వడంతో రాజకీయంగా పెద్ద దెబ్బపడింది. మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గానికి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుర్తుండిపోయే ప్రాజెక్టులకు తీసుకురాలేకపోయారనే విమర్శలు కూడా ఉన్నాయి. తనయుడికి రాజకీయ భవిష్యత్ ఇవ్వాలని చూశారు.. కానీ.. చివరకు ఆయనకే భవిష్యత్ లేకుండా పోయింది.
ఇక అప్పటి నుంచి ఆయన ఎక్కువగా మీడియా ముందుకు రావడం లేదు.. అంతేగాకుండా అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. దీంతో మొత్తంగా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇదే సమయంలో తనయుడు కూడా జాడలేకుండా పోయారు. కొడుకు తీరుతో అటు పార్టీలో, ఇటు ప్రజల్లో పలుచన అయిన ఆ మాజీ మంత్రి ఒకానొక దశలో మానసికంగా కుండిపోయి అనారోగ్యం పాలయ్యారనే వార్తలు కూడా వచ్చాయి. నిజానికి.. ఆయన సీనియారిటీ, సిన్సియారిటీని నమ్మి రెండోసారి టికెట్ ఇచ్చిన గులాబీ బాస్ వద్ద ఇప్పుడు ఆయనకు ముఖం లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోలేక తనయుడు కూడా దిక్కుతోచని స్థితిలో పడిపోయినట్లు తెలుస్తోంది. దురుసుగా వ్యవహరిస్తూ.. ఇష్టారీతిగా మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్ను తానే చేజేతులా నాశనం చేసుకున్నాడని అనుచరులు లోలోపల చర్చించుకుంటున్నారు. ముందుముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.