టీడీపీకి చెందిన మాజీ మంత్రి సూచనతో.. ఎస్పీ కేసు నమోదు చేయలేదని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. నువ్వు నెల్లూరు జిల్లాకు ఎస్పీవా లేదంటే టీడీపీ ఏజెంట్వా అంటూ ఎస్పీపై విరుచుకుపడ్డారు. ఎస్పీ అనుమతి లేనిదే ఎస్టీ, ఎస్సీ కేసులు పెట్టకూడదా? 13 జిల్లాల్లో ఇలాగే జరుగుతోందా? అని ప్రశ్నించారు. రెండు రోజులు ఉంటావు పోతావు.. అధికారంలో వున్న మామాట వినవా?.. తమాషాలు వద్దు.. డీజీపీ నిన్ను కాపాడతారని అనుకుంటున్నావా..? బాగుండదు చెబుతున్నాను అంటూ బహిరంగసభలోనే ఎస్పీపై నల్లపురెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎస్పీపై వైసీపీ ఎమ్మెల్యే ఈ స్థాయిలో విరుచుకుపడటానికి కారణం టీడీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టొద్దని చెప్పడమేనని తెలుస్తోంది. నల్లపురెడ్డి కొంత మంది టీడీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టమన్నారు. అయితే ఈ విషయం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో.. తప్పుడు కేసులు పెట్టవద్దని ఆయన పోలీసులకు చెప్పారట. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టలేదు. దీంతో తాను చెప్పినా కేసులు పెద్దలేదంటూ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అలా ఫైరయ్యారట. జిల్లా ఎస్పీని ఉద్దేశించి బహిరంగ సభలో అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి.