మున్సిపల్ ఎన్నికలను సవాల్ గా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచార పర్వంలోకి దిగారు. కర్నూల్ నుంచి ఆయన ప్రచారం ప్రారంభించారు. కర్నూల్ కార్పొరేషన్ పరిధిలో  పెద్దమార్కెట్‌ ఎదురుగా శ్రీలక్ష్మి నరసింహస్వామి కల్యాణ మండపం నుంచి పాతబస్టాండు, గోశా హాస్పిటల్‌, స్టేట్‌ బ్యాంకు, ఎస్టీబీసీ కళాశాల మీదుగా ఐదు రోడ్ల కూడలి, మౌర్యఇన్‌, బంగారు పేట, ఈద్గా, కొత్తబస్టాండు, బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్‌కు వరకు రోడ్‌షోలో నిర్వహించారు చంద్రబాబు.

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో ఏబీసీడీ పాలన సాగుతోందని చంద్రబాబు విమర్శించారు.  ఏ అంటే అట్రాసిటీ, ఆటవిక పాలన, బీ అంటే బాదుడు, సీ అంటే అవినీతి, డీ అంటే విధ్వంసమని చంద్రబాబు చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారని చెప్పారు. పోలీసులు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియని భయానక పరిస్థితి నెలకొందన్నారు చంద్రబాబు.

వైఎస్ షర్మిల తెలంగాణలో రోడ్డుపై పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు.  జగన్ పిరికి పంద అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దోషి ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఏం పీకారని జగన్‌కు ఓటేస్తారని, ఆయనకు దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు రావాలని చంద్రబాబు అన్నారు.

ఏపీలో మత సామరస్యం దెబ్బతిందని.. ఆలయాలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ పాలనలో అభివృద్ధికి పెద్దపీట వేస్తే.. జగన్‌ విధ్వంసానికి పెద్దపీట వేశారని మండిపడ్డారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో  బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. ఎప్పుడైనా చరిత్రలో ఇన్ని ఏకగ్రీవాలున్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ గెలిచిన స్థానాలనూ వైసీపీ నేతలు వారి ఖాతాలో వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటేసే అవకాశమే లేకపోతే ప్రశ్నించే అవకాశం వస్తుందా?.. ప్రశ్నించే అవకాశం లేకపోతే నాయకులు భయపడతారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.  మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు చంద్రబాబు. 

మరింత సమాచారం తెలుసుకోండి: