న్యూడ్ వీడియోతో పరువు పోగొట్టుకున్న ఎంపీ వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్... ఏ ముఖం పెట్టుకుని హిందూపురంలో జాతీయ జెండా ఎగురవేసేందుకు వచ్చారని నందమూరి బాలకృష్ణ ప్రశ్నించారు. వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సీఎం జగన్ ప్రజలకు వివరించాలని నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని జగన్ ప్రభుత్వంపై బాలకృష్ణ విమర్శించారు. చేత కాని పాలనతో ప్రజలను జగన్ కష్టాలపాలు చేశారని బాలయ్య విమర్శించారు.
సీఎం జగన్.. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, వైసీపీ ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేసిందని నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. ఎరువులు, విత్తనాలను కూడా జగన్ ప్రభుత్వం రాయితీపై ఇవ్వడంలేదన్నారు. హిందూపురంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ కు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బాలయ్య తన సతీమణి వసుంధరాదేవితో కలిసి హిందూపురం గ్రామీణ మండలం చలివెందుల చేరుకున్నారు. అక్కడ ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని నందమూరి బాలయ్య ప్రారంభించారు.
గోరంట్ల వీడియోపై నందమూరి బాలయ్య స్పందించడం వరకూ ఓకే.. అయితే.. గతంలో తాను కూడా మహిళల పట్ల కించపరిచే వ్యాఖ్యలు చేసిన చరిత్ర బాలకృష్ణకు ఉంది. మహిళ కనిపిస్తే.. కడుపు చేసేయాలని అప్పట్లో బాలయ్య ఓ సినీ వేడుకలో చేసిన వ్యాఖ్యలు చాలాకాలం చర్చనీయాంశం అయ్యాయి. అలాంటి బాలయ్య ఇప్పుడు గోరంట్ల ఇష్యూపై ఘాటుగా స్పందించడం విశేషమే.