తన హయాంలో ఆలయాలు కూల్చినందుకే చంద్రబాబు నేడు ఇంతగా పతనం అయ్యారని రోజా విమర్శించారు. ఇప్పుడు దేవుళ్లతో రాజకీయం చేస్తున్నారని, ఆయన మరింత పతనం కావడం తథ్యమని హెచ్చరించారు. గతంలో వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చారని, విజయవాడలో ఆలయాలను కూల్చేశారని ఆరోపించారు. బుద్ధిలేకుండా ఇప్పుడు మళ్లీ చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. అయ్యప్పమాల వేస్తే మద్యం ఆదాయం తగ్గిపోతుందన్న వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు దేవాలయాలు గురించి మాట్లాడం వింతగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ కు కుల, మత పక్షపాత ధోరణులు అంటగట్టాలని చూస్తున్నారని, కానీ అన్నిమతాలకు చెందిన వ్యక్తి సీఎం జగన్ అని ఉద్ఘాటించారు. హిందుత్వం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న చంద్రబాబు తన హయాంలో ఎందుకు గుళ్లను కూల్చివేశారో చెప్పాలని రోజా నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్ లో కుల, మత రాజకీయాలు పనిచేయలని రోజా స్పష్టం చేశారు. టీడీపీ చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారని, తిరుపతి ఉప ఎన్నికలో తగిన బుద్ది చెప్పబోతున్నారని రోజా చెప్పారు.