అసలు మోడీ మదిలో ఏమున్నది..ఏ సంఘర్షణకీ సంకేతం..ఏ సంఘాతానికి ఈ సంకలనం... భయం గుప్పిట్లో కాశ్మిర్ వెల వెల బోతోంది... రేపు కేంద్రం తీసుకునే నిర్ణయం కీలకం..కాశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గతంలో ప్రధాని దృష్టికి వచ్చాయి. ‘ప్రధాని మోదీ దృష్టికి రెండు అంశాలు వెళ్ళాయి. ఒకటి కాశ్మీర్లోయలో పరిస్థితులకు అనుగుణంగానే వ్యవహరించాలని, శాంతికి విఘాతం కలిగించే కార్యక్రమాలు చేపట్టవద్దు.రెండోది ఈ ఏడాదిలోనే అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలి’అని చెప్పినట్టు ఫరూక్ వెల్లడించారు. కాశ్మీర్ లోయలో పరిస్థితిని ప్రధానికి వివరించామని, పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని తెలిపినట్టు ఒమర్ అబ్దుల్లా మీడియాకు చెప్పారు. ఆర్టికల్ 35ఏ రద్దుచేస్తున్నట్టు వస్తున్న వార్తలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారా? అన్న ప్రశ్నకు ప్రత్యేకంగా దాని గురించే మాట్లాడలేదని బదులిచ్చారు. ‘అన్ని ప్రధాన అంశాలు మా మధ్య చర్చకు వచ్చాయి.
అందులో ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370కి సంబంధించినవి ఉన్నాయి’అని ఒమర్ వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ప్రజలను ఎన్నుకున్న ప్రభుత్వానికే ఏ నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందని, ప్రజాతీర్పును తాము గౌరవిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ నేత స్పష్టం చేశారు. మోదీతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని, తాము చెప్పినవన్నీ ప్రధాని ఓపిగ్గా విన్నారని వారు తెలిపారు. మోదీతో సమావేశం తమకు సంతృప్తిని ఇచ్చిందన్న ఒమర్ అబ్దుల్లా మిగతా విషయాలు వెల్లడించేందుకు నిరాకరించారు. జమ్మూకాశ్మీర్ విషయంలో అన్ని రాజకీయ పార్టీలూ ఏకతాటిపైకి రావాలన్న పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ప్రతిపాదన ఆయన దృష్టికి తీసుకురాగా‘ నేషనల్ కాన్ఫరెన్స్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఆదివారం సమావేశమవుతోంది. దానిపై ఓ నిర్ణయం తీసుకుంటాం’అని స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాశ్మీర్ స్వయంప్రతిపత్తికి వికాశం కలిగించే ఏ చర్యలనైనా కలిసికట్టుగా ఎదర్కొంటామని అన్ని పార్టీలు ముక్త కంఠంతో చెప్పాయి.