వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూసేస్తే చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోతే అసలు క్షణం గడవదు. అదే ముందుగానే ఈ విషయం తెలుసుకుని ఎలెర్ట్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక తాజాగా బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చేస్తున్నాయి. తెలుగు సంవత్సరాది పండగ ఉగాది, ఉద్యోగుల సమ్మె, సాధారణ సెలవుల నేపథ్యంలో ఈ నెల ఆఖరులో వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంకుల కార్యాలయాలు మూతేయనున్నారు.
బ్యాంకుల ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం యూనియన్ల సంఘాలతో సమ్మె బాట పడుతున్నారు. దీంతో వరుసగా సెలవులు రానున్నాయి. దీంతో కస్టమర్లు అలెర్ట్గా ఉండాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. బ్యాంకు లావాదేవీలు ఉంటే అవి ఈ లోగానే పూర్తి చేసుకోవాలని చెపుతున్నాయి.
ఈ నెల 25న ఉగాది పండుగ సందర్బంగా సెలవు, మరుసటి రోజు గురువారం బ్యాంకులు పనిచేసినా... బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో లావాదేవీలు జరగవు.
ఇక 27న బ్యాంకు యూనియన్ల సమ్మె ప్రకటించాయి, 28వ తారీకు నాలుగవ శనివారం, 29న ఆదివారం సాధారణ సెలవు. దీంతో బ్యాంకులు తిరిగి ఈ నెల 30న మాత్రమే తెరచుకుంటాయి. అంటే నాలుగు రోజుల గ్యాప్ తర్వాత తిరిగి సోమవారం మాత్రమే బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి.