ఈ మద్య వరుసగా రోడ్డు ప్రమాదాలు ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరగడం..నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోవడంతో ఎంతో మంది అనాధలుగా మిగులుతున్నారు..రోడ్డున పడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో మంచి భవిష్యత్ కోసం ఆరాటపడుతున్న ఓ వర్థమాన నటుడు తన లక్ష్యాన్ని చేరుకోక ముందే ప్రాణాలు కోల్పోవడంతో సహ నటులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వర్థమాన నటుడు నన్నం సునీల్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
ఆయన వయసు 24 సంవత్సరాలు. కొడవలూరు మండల పరిధిలోని రాచర్ల పాడు వద్ద నేషనల్ హైవేపై అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగింది. కోవూరు మండలం పడుగుపాడు గ్రామానికి చెందిన షకీల్ హైదరాబాద్లో సినీ సంగీత దర్శకుడిగా ఉన్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లికి చెందిన సునీల్ కొన్నేళ్లుగా షకీల్ వద్ద శిక్షణ పొందుతూ.. టీవీ సీరియళ్లు, సినిమాల్లో నటిస్తున్నాడు.
షకీల్ తమ్ముడు సలావుద్దీన్ ఓ ఇంటర్వ్యూ నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లగా, అదే కారులో స్వగ్రామానికి వెళ్లేందుకు సునీల్ కూడా బయలుదేరాడు. రాచర్లపాడు వద్ద గుర్తు తెలియని వాహం వీరి కారును ఢీకొనగా, సునీల్ అక్కడికక్కడే మరణించాడు.
ఈ ప్రమాదంలో సలావుద్దీన్ కోమాలోకి వెళ్లాడు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. తన బంగారు భవిష్యత్ కోసం ఎన్నో కలలు కంటున్న సునీల్ అర్థాంతరంగా చనిపోవడంతో బుల్లితెర ఇండస్ట్రీ సంతాపాన్ని ప్రకటించింది.