2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'వైఎస్సార్ రైతు భరోసా' పథకం ఒట్టి బోగస్ పథకమని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కో రైతుకు అక్షరాల 77,500 రూపాయలు ఎగ్గొట్టారని తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ సీఎం, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. టీడీపీ సీనియర్ నాయకులతో  మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఈ కార్యక్రమంలో మొత్తం అన్ని (175) నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జిలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ‘రైతు భరోసా’ పేరుతో ఈ 5 ఏళ్లలో ఒక్కో రైతుకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం 37,500 రూపాయలు మాత్రమే అని పేర్కొన్నారు. అదే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే 'అన్నదాత సుఖీభవ' అలాగే రుణమాఫీ 4, 5 కిస్తీల కింద ఒక్కో రైతుకు సుమారుగా 1.15 లక్షల రూపాయలు వచ్చి ఉండేవని పేర్కొన్నారు. ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కో రైతుకు రూ.77 వేలకు పైగా ఎగ్గొట్టి మీడియాలో మాత్రం గొప్పగా ప్రకటనలు ఇచ్చుకోవడం రైతులకు నమ్మక ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు విపత్తు సహాయ నిధి క్రింద రూ.4 వేల కోట్లు ఇస్తామంటూ రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక మాత్రం మాట తప్పి, మడమ తిప్పారని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆపద సమయంలో కేవలం రూ. 500 మాత్రమే ఇస్తామని, వారం రోజులు నీళ్లలో ఇళ్లు మునిగితేనే రేషన్ ఇస్తామంటూ వరద బాధితులతో చెలగాటం ఆడుతున్నారని ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: