ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం తిరుపతి ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు కొనసాగుతున్నాయి. అయితే ఇదంతా ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ జరిగే తంతే.. కానీ ఇటీవలే తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో తెర మీదికి వచ్చిన కొత్త వాదన మాత్రం సంచలనంగా మారిపోయింది. ఇటీవలే వ్యాక్సిన్ గురించి మాట్లాడిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ సందర్భంగా ప్రజలందరినీ ఉత్తేజ పరచడానికి గురజాడ రాసిన దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్.. అంటూ ఒక తెలుగు కవితను చెప్పారు అన్న విషయం తెలిసిందే.
ఇక తెలుగు కవితను ప్రధాని మోదీ చెప్పడంపై తెలుగు ప్రజలందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం ప్రధాని మోడీ చెప్పిన తెలుగు కవితను కాంట్రవర్సీ చేసేందుకు ప్రయత్నించారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజలను ఆకర్షించడానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు కవిత్వాన్ని చెప్పారు అంటూ కొంతమంది వాదన తెరమీదకు తీసుకురావడం సంచలనంగా మారిపోయింది. అయితే దీనిపై స్పందిస్తున్న విశ్లేషకులు.. చిన్న విషయం పై మరీ ఇంత దారుణమైన రాజకీయాలు ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.