టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం జన్మభూమి కమిటీల పేరుతో జనాలను దోచుకుతిన్నారని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డ వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆయన మంగళవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఏపీలో చంద్రబాబు జన్మభూమి కమిటీలను తన పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసి గ్రామ పంచాయితీలను నిర్విర్యం చేశాడని ఆరోపించారు. దేశానికి పట్టుగొమ్మలే గ్రామ పంచాయతీలు అన్న మహాత్మగాంధీ కలలను చంద్రబాబు కల్లలు చేశాడని దుయ్యబట్టారు.
ప్రజల చేత ఎన్నికైన సర్పంచ్లను, ఎంపీటీసీలను, స్థానిక సంస్థలను కేవలం నామమాత్రంగా మార్చి, జన్మభూమి కమిటీలకు రాజ్యాధికారం కల్పించి ప్రజలను నిలువు దోపిడి చేశారని ఉమ్మారెడ్డి అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ అధినేత సీఎం జగన్ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నారని, అందుకు నిదర్శనం జన్మభూమి కమిటీలను రద్దు చేసి, స్థానిక సంస్థలకు, ప్రజాప్రతినిధులకు పెద్ద పీట వేస్తున్నారని అన్నారు.
ఇకముందు ఏపీలో స్థానిక సంస్థలను బలోపేతం చేసి ప్రజారంజక పాలన సాగించేందుకు కంకణం కట్టుకున్న సీఎం జగన్ ను ప్రజలు అభినందిస్తున్నారని తెలిపారు. గ్రామ సచివాలయాలపై కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, మంచిని మంచి అని చెప్పే సంస్కారంటీడీపీ నేత చంద్రబాబుకు లేదని, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలకు అందించాలనేదే మా ప్రభుత్వ లక్ష్యమని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
చంద్రబాబు ఐదేండ్లు అధికారంలో ఉండి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని, కానీ మా నాయకుడు వైయస్ జగన్ పాలనతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని, 4 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత మా నాయకుడిదేనని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. ఆనాడు చంద్రబాబు గ్రామ పంచాయతీలను పక్కన పెట్టి, జన్మభూమి కమిటీలను తీసుకొచ్చి దోచుకుతిన్నారని, ఈనాడు సీఎం జగన్ మాత్రం స్థానిక సంస్థలకే పట్టం కడుతున్నాడని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు.