సంక్షేమ పథకాల అమలులో సొంత జిల్లా చిత్తూరునే చంద్రబాబునాయుడు మరచిపోయినట్లున్నారు. పథకాల అమలు విషయంలో అందరికీ బుద్దులు చెప్పే చంద్రబాబు తన సొంత జిల్లా విషయంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందరికీ శకునం చెప్పే బల్లే కుడితిలో పడిందన్నది సామెత. ఆ సామెతాలానే ఉంది చంద్రబాబునాయుడు వ్యవహారం. ఎందుకంటే, సంక్షేమ పథకాల అమలులో అన్నీ జిల్లాల్లోకి చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలోనే జనాల సంతృప్తి స్ధాయిలు చాలా తక్కువుగా ఉందట. పైగా ఆ విషయాన్ని శుక్రవారం జరిగిన పార్టీ విస్తృతస్ధాయి నేతల సమావేశంలో స్వయంగా చంద్రబాబే చెప్పటం గమనార్హం.
పథకాల అమలులో వెనకబడ్డాయి
పేద ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అయితే, పథకాల అమలులో అనేక వివాదాలున్నాయి. సరే వివాదాలు ఎలాగున్నా రోజు రోజుకు పథకాల అమలులో ప్రజల సంతృప్తస్ధాయి పెరిగిపోతోందని చంద్రబాబు తరచూ చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటిది రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోల్చి చూస్తే చిత్తూరు, కడప జిల్లాల్లోని జనాల్లో సంతృప్తస్ధాయిలు చాలా తక్కువుగా ఉందట. అలా ఎందుకు ఉందో అర్ధం కావటం లేదని పాపం చంద్రబాబు బాధపడిపోతున్నారు.
నిజానికి జనాల్లో సంతృప్త స్ధాయిలకు సంబంధించి చంద్రబాబు చెబుతున్న అంకెలకు, శాతానికి మొదటినుండి ఏమాత్రం విశ్వసనీయత లేదు. సిఎం చెబుతున్న లెక్కలకు హేతువు ఏంటో కూడా ఎవరికీ తెలీదు. ప్రతీ సమావేశంలోనూ అది పార్టీ కావచ్చు లేదా కలెక్టర్ల సదస్సులూ కావచ్చు చంద్రబాబు మాత్రం పదే పదే సంతృప్త స్ధాయిల గురించే చెబుతుంటారు. చంద్రబాబు చెప్పే అంకెలకు శాస్త్రీయత అయితే లేదన్నది వాస్తవం. ఇపుడు కూడా చంద్రబాబు చెప్పే మాటలకు సరైన లెక్కలుండవు. అందుకే సంతృప్తస్ధాయిల గురించి చంద్రబాబు ఎప్పుడు చెప్పినా పార్టీ నేతలు, ఉన్నతాధికారులు ఎప్పుడూ సీరియస్ గా పట్టించుకున్నట్లు కనబడలేదు.