షెడ్యూల్ ఎన్నికలు
తరుముకొచ్చేస్తున్నాయి. ఈ పరిస్ధితుల్లో ముందస్తుగా అభ్యర్ధుల ప్రకటనపై ఇటు
చంద్రబాబునాయుడు అటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ
నేపధ్యంలో ముందస్తు అభ్యర్ధుల ప్రకటన జగన్ కు ఏమాత్రం లాభిస్తుందన్న విషయమై
పార్టీలో చర్చలు మొదలయ్యాయి. ముందస్తు అభ్యర్ధుల ప్రకటన అన్నది తెలంగాణాలో
కెసియార్ చేసిన ప్రయోగంతో ఏపిలో కూడా ఆలోచన మొదలైంది. తెలంగాణలో ఎన్నికలకు ఏపిలో
ఎన్నికలకు చాలా తేడా ఉందన్న విషయం మరచిపోకూడదు.
తెలంగాణాలో కెసియార్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, టిజెఎస్ జట్టుకట్టాయి. అదే ఏపికి వచ్చేసరికి దాదాపు పోటీ చాలా నియోజకవర్గాల్లో త్రిముఖమయ్యే అవకాశాలే ఎక్కువున్నాయి. ఇఫ్పటి పరిస్దితి ప్రకారమైతే టిడిపి-వైసిపి స్ట్రైట్ ఫైట్ కే అవకాశముంది. కాకపోతే మధ్యలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారమే అంతుచిక్కటం లేదు. అన్నీ నియోజకవర్గాల్లో ఒంటిరిగానే పోటీ చేస్తానని పవన్ ప్రకటిస్తున్నా చాలామందికి నమ్మకం కుదరటంలేదు. ఈ పరిస్ధితుల్లో అందరి చూపు వైసిపి పై పడింది.
అభ్యర్ధులను ముందస్తుగా ప్రకటిస్తే జగన్ కు ఎంత వరకూ లాభమనే చర్చ పార్టీలో మొదలైంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుత సిట్టింగుల్లో చాలా వరకూ మళ్ళీ పోటీకి అవకాశం దక్కే ఛాన్సే ఎక్కువ. కాబట్టి ఆ నియోజకవర్గాల్లో జగన్ ముందస్తుగానే టిక్కెట్లు ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను మొదటి విడతలో సుమారు 40 మంది అభ్యర్ధులను ప్రకటించేస్తారట. ఇక రెండో దశలో 23 ఫిరాయింపు నియోజకవర్గాల్లో జగన్ ఫ్రెష్ క్యాండిడేట్లను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
మూడో దశలో డిస్ప్యూట్స్ లేని నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారట. అంటే పోటీ లేకుండా ఒకే అభ్యర్ధిగా అందరూ భావిస్తున్న నియోజకవర్గాలన్నమాట. చివరగా పోటీ ఎక్కువున్న నియోజకవర్గాలపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. మొదటి మూడు దశల్లోకి వచ్చే వారికి టిక్కెట్లను ముందుగానే ప్రకటించేస్తే నాలుగో దశగా భావిస్తున్న నియోజకవర్గాలపై ఎక్కవ దృష్టి పెట్టవచ్చని జగన్ వ్యూహంగా చెబుతున్నారు. అంటే ఇప్పటికే సుమారు 15 మందిని అభ్యర్ధులుగా జగన్ ప్రకటించేసిన విషయం అందరికీ తెలిసిందే.
కర్నూలు జిల్లాలోని పత్తిపాడులో శ్రీదేవిరెడ్డి, కుప్పంలో చంద్రమౌళి లాంటి 15 మంది అభ్యర్ధులు చాలకాలంగా నియోజకవర్గాల్లో ప్రచారం చేసేసుకుంటున్నారు. కాబట్టి మిగిలింది 160 నియోజకవర్గాలే. ముందస్తుగా అభ్యర్ధులను ప్రకటించినా టిక్కెట్టు దక్కని వారు ఇతర పార్టీల్లోకి జంప్ చేసే అవకాశాలు తక్కువే. ఎందుకంటే, టిడిపికి ఓటమి తప్పదని జరుగుతున్న ప్రచారం వల్ల అందులోకి వెళ్ళేందుకు ఎవరూ ఇష్టపడరు. అలాగని జనసేన పై ఆశలు పెట్టుకోవటం కూడా లేదు. కాబట్టి టిక్కెట్లు రాని నేతల్లో చాలామంది పార్టీని వీడే అవకాశాలైతే లేవు. ఈ పాయింట్ మీదే జగన్ దృష్టి పెట్టి ముందస్తు అభ్యర్ధులకు జాబితాను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది.