
ప్రపంచ శ్రేయస్సు కోసం, వచ్చిన మహమ్మారిని నియంత్రించడం కోసం కొన్ని కఠిన నిబంధనలు తప్పవు. అవి ఎంతటివారైనా పాటించవలసిందే. నేను గొప్ప, నేను దిబ్బ అన్న వారందరు పాటించాల్సిందే. వైరస్ కు తెలియదు కదా, గొప్పనో దిబ్బనో, వస్తే తీసుకెళ్లిపోతుంది. ఇంకో పదిమందికి వ్యాప్తి చెందుతుంది, వాళ్ళ ద్వారా ప్రపంచం అంతటా అదే ఉండిపోతుంది. ఇంత ఘోరం కంటే, మాస్క్ ధరించడం, శానిటైజర్ తో తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, గుంపులుగా ఉండకుండా, అందరికి వీలైనంత దూరం పాటించడం చాలా చిన్న పనులే. అయితే ఎక్కువ కాలం ఇవన్నీ పాటించడం కూడా కాస్త కష్టంగా ఉంటుంది అనేది కూడా వాస్తవమే. దానికే అసహనం చెందటం మంచిది కాదు. కొన్ని సార్లు బానిసలమా అనే ప్రశ్నకు సమాధానం ఉండదు, పాటిస్తూ పోవాల్సిందే.
అమెరికాలో కూడా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. దానితో విలాసానికి, ఉత్సాహానికి, స్వేచ్చతో జీవనం గడిపే వాళ్లకు ఈ నిబంధనలు పాటించడం, అది కూడా ఇన్నాళ్ళుగా అవి పాటిస్తూనే ఉండటం సహజంగానే అసహనం కలిగిస్తాయి. దానిని ఒక ప్రయాణికుడు సరికొత్తగా వ్యక్తపరిచాడు. తాను విమానంలో ప్రయాణించదలిచి, అందుకు టికెట్ కొన్నాడు, విమానంలో కూర్చున్నాడు. తీరా అందరు విచిత్రంగా చూస్తున్నారు, కారణం అతడు ధరించిన మాస్క్. ఆ మాస్క్ సాధారణమైనది కాదు, మహిళల లో దుస్తులు అతడు మాస్క్ గా ధరించాడు. అది చూసి, సిబ్బంది వేరేది ధరించాలని సూచించారు. ససేమిరా అన్నాడు. చేసేది లేక, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించలేక, అతడిని విమానం లో నుండి దించేశారు. అతడి అసహనం అతడు వ్యక్తపరిచాడు. అయితే అది కాస్త విచిత్రంగానే ఉంది. ఈ పరిస్థితులలో ఇలాంటివి పలు చూడాల్సి వస్తుంది మరి. అందరి పరిస్థితి అదే. అసహనం ఉన్నప్పటికీ, సర్దుకు పోతున్నారు.