తాజాగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని భైంసా లో జరిగిన రోడ్ షో లో పాల్గొన్నారు అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ... ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 5 నెలల కింద  కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చారు. కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దని అప్పుడు కేసీఆర్ గారు చెప్పారు. ఐదు నెలల్లో కాంగ్రెస్ పాలన ఎట్ల ఉందో చూశారు కదా? కరెంట్ కోతలు ఉన్నాయా? రేవంత్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిండు. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ. 2500, పెద్దమనుషులకు రూ. 4 వేలు, తులం బంగారం, స్కూటీలు అని చెప్పిండు. రేవంత్ రెడ్డి చెప్పిన హామీల్లో ఒక్క హామీ అన్న అమలైందా? ఇంకా కాంగ్రెస్ ను నమ్ముదామా? మళ్లీ వాళ్లకే ఓటు వేద్దామా? ఆత్రం సక్కు గారు సీనియర్ నాయకులు.

ఆదివాసీల కోసం ఎంతో కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు 5 నెలల్లో చాలా హామీలిచ్చి మనల్ని మోసం చేశారు. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. పదేళ్ల క్రితం ఎన్నో డైలాగులు చెప్పి బీజేపీ వాళ్లు కూడా లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే తెలంగాణ బాగుండే అని అనుకునేటోళ్లకు ఒక ఉపాయం చెబుతా.  మీరు 13 తారీఖు నాడు సక్కు గారిని కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించండి. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ మనం సరైన వ్యక్తులకు అవకాశం ఇవ్వలేకపోయాం. మన పార్టీ నుంచి  వెళ్లిపోయిన వాళ్లు పోనివ్వడి. చెత్తంతా పోతోంది.

బీజేపీ వాళ్లు ఏమైనా అంటే నమో అంటారు. నమో అంటే నరేంద్రమోడీ కాదు నమ్మించి మోసం చేసే వ్యక్తి. పదేళ్లలో దేశానికి గాని ఆదిలాబాద్ కు గానీ ప్రధాని ఒక్క పనిచేయలే. ఆదిలాబాద్ లో సీసీఐ ను ఓపెన్ చేయలే. బీజేపీ ఎంపీ ముధోల్ తాలుకాలో ఒక్కటంటే ఒక్క పని చేయలే.  2014 మోడీ చాలా హామీలిచ్చిండు. రూ. 15 లక్షలు అందరి అకౌంట్లో వేస్తా అన్నాడు. రైతుల ఆదాయం డబుల్, అందరికీ ఇళ్లు, ఇంటింటికి నల్లా అని చాలా చెప్పాడు. కానీ చెప్పిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. పదేళ్లలో చేసిన పని ఏందయ్యా అంటే మేము గుడి కట్టినం అంటారు. మరి కేసీఆర్ గారు వెయ్యేళ్లు నిలిచిపోయేలా యాదాద్రి గుడిని కట్టలేదా?.ఒక్క యాదాద్రి గుడి మాత్రమే కాదు...ఆధునిక దేవాలయాలైన సాగునీటి ప్రాజెక్ట్ లు కూడా కట్టిండు.  

పదేళ్లు ప్రధానిగా పని చేసిన మోడీ ఒక్క బడి కట్టలే, గుడి కట్టలే, కొత్త కాలేజ్ ఇవ్వలే, ఓ ప్రాజెక్ట్ కట్టలే. చేసిన పనులు చెప్పుకునే పరిస్థితి లేదు బీజేపీకీ? అందుకే దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. ఏమన్న అంటే జై శ్రీరాం అంటారు. శ్రీరాముడు అందరి వాడు. దేవుళ్లు బీజేపీకి చెందిన వాళ్లు కాదు. రాముడు మర్యాద పురుషుడు. రాజధర్మం పాటించాలని చెప్పాడు. మోడీ మాత్రం గుజరాత్ కు వేల కోట్లు ఇస్తాడు. తెలంగాణ కు బుడ్డ పైసా కూడా ఇవ్వడు.


మరింత సమాచారం తెలుసుకోండి: