మన భారతదేశంలో సంస్కృతీ, సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారనే సంగతి ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయమే. ఎలాంటి సాంప్రదాయక వ్యవహారం అయినా కూడా చాలా పద్దతిగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఇక హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మహా సమ్మేళనం “కుంభమేళా” అయితే ఈ కుంభమేళా ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతోంది. అవి హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, ఉజ్జయినీ, నాసిక్. ఈ నాలుగు ప్రాంతాల్లో ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి అత్యంత భారీ ఎత్తున ఈ పవిత్ర కుంభమేళా కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ కుంభమేళా చరిత్ర ప్రాముఖ్యత విషయానికి వస్తే... శ్రీ మహా విష్ణువు… అమృతాన్ని హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, ఉజ్జయినీ, నాసిక్‌లలో ధారపోశారని, అందుకే ఈ నాలుగు ప్రదేశాల్లో గ్రహాలను అనుసరించి కుంభమేళా జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఆవిధంగా ఈ ఏడాది హరిద్వార్‌లో కుంభమేళా జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని భారీ ఏర్పాట్లు చేసింది. తాజాగా కుంభమేళాలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్రం కూడా విడుదల చేసింది. దీనిపై ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ మాట్లాడుతూ.. కుంభమేళా నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వబోమని ఉద్ఘాటించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా హరిద్వార్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరో వూహన్‌గా మారనివ్వబోమని ఆయన వ్యాఖ్యానించారు.





కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, పదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులను కుంభమేళాలో పాల్గొనకుండా చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా గర్భిణులు, తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతించరు. ఈ విషయంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతో సమన్వయం కుదుర్చుకుంటుంది. కోవిడ్-19 మహమ్మారితో పోరాడేందుకు వ్యక్తుల మధ్య కనీసం ఆరు అడుగుల దూరాన్ని పాటించాలని కేంద్ర ప్రభుత్వం భక్తులను కోరింది. కోవిడ్-19 నిబంధనలను పాటించని భక్తులపై భారీ జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించింది. పార్కింగ్ ప్రదేశాల్లో అధికారులు ప్రభుత్వ ధరల ప్రకారం ముఖానికి ధరించే మాస్క్‌ లను అమ్ముతారు. కుంభమేళాకు తరలి వచ్చే భక్తులు తప్పనిసరిగా నెగటివ్‌ ఆర్టీ-పీసీఆర్‌ నివేదికలు తీసుకురావాలని కేంద్రం ఆదేశించింది. హరిద్వార్‌కు చేరుకొనే 72 గంటల్లోపు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయించుకుని రావాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇప్పటివరకూ వ్యాక్సిన్‌ వేయించుకున్న ఆరోగ్య సిబ్బంది మాత్రమే ఈ కుంభమేళాలో పాల్గొంటారని తెలిపింది. వీలైనంత వరకూ ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని వారు సూచించారు. కొవిడ్‌-19 నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిపై చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఇక, మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో లాంఛనంగా భక్తులు స్నానాలు ఆచరించారు. ఇక, పూర్తిస్థాయిలో కుంభమేళా ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో రోజుకు సుమారు 10 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. విశేష ప్రాధాన్యంగల రోజుల్లో 50 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 27న మాఘ పూర్ణిమ, మార్చి 11న మహాశివరాత్రి, ఏప్రిల్ 12న సోమావతి అమావాస్య, ఏప్రిల్ 14న వైశాఖి, ఏప్రిల్ 21న శ్రీరామ నవమి, ఏప్రిల్ 27న చైత్ర పూర్ణిమ పర్వదినాల్లో విశేష స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: