‘మళ్లీ రావా’తో దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి... ‘జెర్సీ’తో ఒక్కసారిగా జెట్ స్పీడులో దూసుకెళ్లిన గౌతమ్ తిన్ననూరి, తన స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫాంలో లేని హీరో సుమంత్‌తో సింపుల్ ఎమోషనల్ లవ్‌స్టోరీ తీసి, సిల్వర్ స్క్రీన్‌పై మంచి విజయం అందుకున్న అతను... నానితో చేసిన జెర్సీ సినిమాతో అంతా ఆశ్చర్యపోయేలా చేశాడు. ఆ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! ఈ హవాలోనే గౌతమ్‌కు మెగా క్యాంప్‌ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా అనేది అనౌన్స్ కాకపోయినా, అనౌన్స్‌మెంట్ ముందు దాకా వెళ్లింది. లైన్ నచ్చి చరణ్ ఓకే చెప్పడంతో స్క్రిప్ట్ వర్క్ జోరుగా నడిచింది.

అయితే కొన్ని నెలల పాటు కలిసి పని చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను ఇద్దరూ కలిసి క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ కారణాలేమిటో అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు అదే విషయాన్ని గౌతమ్ తిన్ననూరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీగా బయటపెట్టాడు. చరణ్‌కు మొదట చెప్పిన ఐడియా చాలా బాగా నచ్చిందట. కానీ దానిపై కథను పూర్తిగా తయారు చేసిన తర్వాత... దాన్ని చరణ్‌కు వినిపించలేదట గౌతమ్. ఎందుకంటే ఆ కథ చరణ్ రేంజ్‌కు కరెక్ట్ కాదని తనకే అనిపించిందట. "ఒకసారి ఛాన్స్ వచ్చింది కదా అని హడావుడిగా సినిమా తీసేయడం నన్ను సంతృప్తిపరచదు. చరణ్ లాంటి స్టార్‌తో చేయాలంటే... కథలోనే మేజిక్ ఉండాలి" అని గౌతమ్ చెప్పడం విశేషం.

ఇక విజయ్ దేవరకొండతో తీసిన ‘కింగ్డమ్’ విషయంలో కూడా కొంత కాలం క్రితం ప్రచారం జరిగింది – “చరణ్ రిజెక్ట్ చేసిన కథే కింగ్‌డమ్” అంటూ. కానీ గౌతమ్ అదే ఇంటర్వ్యూలో ఈ ప్రచారాన్ని ఖండించాడు .. “చరణ్‌కు చెప్పిన కథ వేరు, కింగ్‌డమ్ కథ వేరు” అని క్లారిటీ ఇచ్చాడు. మరో విశేషం ఏంటంటే... 'మళ్లీ రావా' కథను మొదట విజయ్ దేవరకొండకే చెప్పేందుకు ప్రయత్నించాడట గౌతమ్. కానీ అప్పట్లో ‘పెళ్లిచూపులు’ సక్సెస్‌లో విజయ్ బిజీగా ఉండటం వల్ల ఆ కథను వినలేదట. "ఆ టైమ్‌లో ఆయన వద్దు.. తర్వాత చూద్దాం అన్నాడు" అని గౌతమ్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈ దాంత‌ చూస్తే గౌతమ్ తిన్ననూరి సినిమాలపై కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ కోసం కచ్చితంగా పోరాడే దర్శకుడు అన్న విషయం మరోసారి రుజువైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: