తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హఠాత్ భేటీ జరగడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జూబ్లీహిల్స్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ భేటీ రాజకీయ వేడి పెంచేసింది. వ్యక్తిగతంగా కలుసుకున్నారు అనుకునేలోపే.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలే అసలు అజెండా అన్న టాక్ పక్కా అయింది. జూబ్లీహిల్స్ టార్గెట్ – చిరు ఎఫెక్ట్ వాడుకునే ప్లాన్! .. మాగంటి గోపినాథ్ మృతితో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం బీఆర్ఎస్‌కి చెందినది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఆ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇదే క్రమంలో సినీ లోకంలో అఖండ గుర్తింపు ఉన్న చిరంజీవి సలహా తీసేందుకు రేవంత్ ముందుకు రావడమంటే.. అది ఓ స్ట్రాటజిక్ అడుగే అనిపిస్తోంది. చిరు అభిప్రాయం మేరకు ఒక ప్రముఖ సినీ అభ్యర్థిని బరిలోకి దింపాలన్నదే కాంగ్రెస్ ప్లాన్ అని విశ్లేషకులు అంటున్నారు.


మెగా ఫ్యామిలీ మద్దతుతో ఓటర్ల మన్నన? .. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి ప్యాషనేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిరు ఎవరిని సూచించితే, ఆ అభ్యర్థి ప్రచారంలో మెగా ఫ్యామిలీ మద్దతుగా వినిపించగలడని, అది ఓట్లపై ప్రభావం చూపుతుందన్నది రేవంత్ క్యాల్కులేషన్ అని అంటున్నారు. చిరంజీవి కాంగ్రెస్‌కు సానుకూలంగా ఉన్న నేపథ్యం, గతంలో ప్రజారాజ్యం విలీనంతో వచ్చిన అనుబంధం.. ఇవన్నీ ఈ ప్లాన్‌కి బలాన్నిచ్చాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యలపై చర్చ..? .. ఇటీవల టాలీవుడ్‌లో కార్మిక సంఘాల సమ్మె, షూటింగ్ బంద్ వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ భేటీలో ఆయా సమస్యలపై చర్చ జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నా, అసలైన హైలైట్ మాత్రం రాజకీయమే అంటున్నారు. పైగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ప్రభుత్వమే కలిసి నిర్వహించాలన్న ఆలోచనతోనూ చర్చ జరిగి ఉండే అవకాశముంది.


పాత పాట మళ్లీ ప్లే అవుతుందా? .. చిరంజీవి మళ్లీ రాజకీయ రంగప్రవేశం చేస్తారా? లేక గౌరవ సలహాదారుగా కాంగ్రెస్‌కు క్రియాశీల మద్దతిస్తారా? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ మెగా బ్రాండ్‌ను ఎన్నికల్లో ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై కాంగ్రెస్ స్పష్టమైన వ్యూహంతో ఉంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో చిరు ప్రభావాన్ని ఫుల్‌గా క్యాష్ చేసుకోవడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగిందని అంతా చర్చించుకుంటున్నారు. మొత్తానికి… చిరు-రేవంత్ జంట మళ్లీ రంగంలోకి దిగితే, జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గుతారన్నది ఆసక్తికరంగా మారింది!

మరింత సమాచారం తెలుసుకోండి: