భారత్లో విద్యుత్తు వాహనాలకు గిరాకీ పెరుగుతోంది. అందుకనుగుణంగా దేశవ్యాప్తంగా ఛార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాల్సి ఉంటుంది. దీనివల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం తర్వాత ఈ రంగంలో దాదాపు 10,000-12,000 ఉద్యోగాలు అందుబాటులోకి రావొచ్చని ‘టీంలీజ్ సర్వీసెస్’ అనే మ్యాన్పవర్ కన్సల్టింగ్ సంస్థ అంచనా వేసింది. రాబోయే మూడు నెలల్లో విద్యుత్తు వాహన సంస్థలు నియామకాలు చేపట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పింది. నాలుగు మెట్రో నగరాలు, నాలుగు కాస్మోపాలిటన్ సిటీల్లో 60 ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఈ సంస్థ తెలిపింది.
పెరగనున్న అమ్మకాలు
విద్యుత్తు వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. తక్కువ జీఎస్టీ రేటుతో పాటు ఫేమ్-2(ఫాస్టర్ ఆడాప్షన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్) పథకం వల్ల అనేక ప్రధాన వాహన తయారీ సంస్థలు విద్యుత్తు వాహనాల ఉత్పత్తివైపు మళ్లాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించాయి. 2030 నాటికి దేశంలో వ్యక్తిగత ద్విచక్ర వాహనాలు 25-35 శాతం, విద్యుత్తు కార్లు 20-30 శాతం, త్రిచక్ర వాహనాలు 65-75 శాతానికి పెరిగే అవకాశం ఉందని కేపీఎంజీ అంచనా వేసింది.
3 నెలల్లో ఉద్యోగావకాశాలు
ఇప్పటికే విద్యుత్తు వాహన తయారీ రంగంలో ఉన్న సంస్థలతో పాటు తాజాగా ఓలా ఎలక్ట్రిక్, టెస్లా మోటార్స్ ఈ విభాగంలోకి ప్రవేశించాయి. దీనివల్ల రాబోయే మూడు నెలల్లో ఉద్యోగ నియామకాలు భారీ స్థాయిలో పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో ‘కండక్టెడ్, రేడియేటెడ్ ఎమిషనన్స్’ విభాగంలో నైపుణ్యం ఉన్నవారిని ఉన్నతస్థాయి ఉద్యోగాలకు, డిప్లోమా, ఐటీఐ సర్టిఫికెట్తో పాటు ఈ రంగంలో అనుభవం ఉన్నవారిని కిందిస్థాయి ఉద్యోగాలకు తీసుకునే అవకాశం ఉందని టీంలీజ్ తెలిపింది. కొత్తగా ఉద్యోగాలతోపాటు కంపెనీలతో మాట్లాడుకునే విధానాన్నిబట్టి వ్యాపార అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.