భారతదేశంలో లోక్‌ సభ, అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో రాజకీయ నాయకులు రెండు చోట్ల పోటీ చేయడం కొత్తేమి కాదు. గతంలో వాజ్‌పేయి, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, ఎల్.కె.అద్వాని, ఎన్టీఆర్‌, బిజూపట్నాయక్‌,  సోనియాగాంధీ, లాలూప్రసాద్ యాదవ్, నరేంద్రమోదీ, ములాయంసింగ్ లాంటి నేతలు రెండు స్థానాల్లో పోటీ చేశారు. అయితే ఇది మేలా.. కీడా అనేది అంతుబట్టని విషయం.

1985లో దివంగత సీఎం ఎన్టీరామారావు నల్గొండ, హిందూపురం, గుడివాడ నుంచి పోటీ చేశారు. ఈయన పోటీ చేయడానికి కారణాలేవైనప్పటికి ప్రతి ఎన్నికల్లో ఇలాంటి అంశం ఆకట్టుకునే విషయంగా మారుతోంది. అక్కడి ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరచాలనో లేక ఒక స్థానంలో విజయం సాధించలేకపోయినా మరో స్థానంలో  విజయం సాధించడానికి  అభ్యర్థులు రెండు చోట్ల పోటీ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న లోక్‌ సభ ఎన్నికల్లో కూడా ఇదే ఒరవడి కొనసాగుతోంది.

గతంలో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి, వడోదర లోక్‌ సభ స్థానాల నుంచి ఎన్నికల బరిలో నిలిచి రెండుస్థానాలను కైవసం చేసుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ రెండు లోక్ సభ స్థానాల నుంచి ఎన్నికల బరిలో ఉంటారని కొంత కాలంగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ వార్తలను ఎట్టకేలకు నిజం చేశారు. కేరళ రాష్ట్రం వయనాడ్ స్థానం నుంచి రాహుల్ పోటీలో ఉన్నారు. మరో వైపు రాహుల్ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అమేథీ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ రాహుల్‌కు పోటీగా స్మృతి ఇరానీని బీజేపీని ఎన్నికల బరిలోకి దింపింది. రాహుల్ రెండు చోట్ల  ఎన్నికల బరిలోకి దిగడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 1999 ఎన్నికల్లో అమేథీ, బళ్లారి నుంచి పోటీ చేశారు.

మెగా ఫ్యామిలీ నుంచి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ప్రస్తుత ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల నుంచి బరిలో ఉన్నారు. విశాఖ జిల్లా గాజువాక, తన సొంత జిల్లా పశ్చిమగోదావరిలోని భీమవరం నుంచి బరిలోకి దిగారు. 2014లోనే పవన్ పార్టీని స్థాపించినప్పటికి అప్పట్లో జరిగిన ఎన్నికలకు దూరం పాటించి టీడీపీకి మద్దతు పలికారు. పవన్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం. మొదట్లో తిరుపతి, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే జనసేనాని మాత్రం భీమవరం స్థానం వైపే మొగ్గు చూపి బరిలో నిలిచారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతి నుంచి  పోటీ చేశారు. అప్పట్లో చిరు తిరుపతి నుంచి మాత్రమే విజయం సాధించారు. ఏపీ రాజకీయాల్లో ప్రతి రోజు టీవీ ఛానెళ్ళలో కనబడుతున్న ప్రజా శాంతి పార్టీ అధ్యక్షలు కేఏపాల్‌ నరసాపురం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉండి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

ఒడిశా సీఎం బిజూ జనతా దళ్ అధినేత నవీన్‌ పట్నాయక్‌ మొట్ట మొదటిసారిగా రెండు అసెంబ్లీ స్థానాల నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. 2000వ సంవత్సరం నుంచి ఆయన సీఎంగా కొనసాగుతున్నారు. పట్నాయక్‌ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటి నుంచి దక్షిణ ఒడిశాలోని హింగిలి నియోజవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉంటూ వస్తున్నారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఆయన బిజేపూర్‌ నుంచి కూడా పోటీ లో ఉంటున్నారు. పశ్చిమ ఒడిశాలో బీజేపీ బలంగా ఉందనే ప్రచారం జరుగుతోంది.

మరి రెండు చోట్ల నుంచి పోటీ చేయడం నాయకులకు సేఫ్ అయితే ఓటర్లకు మాత్రం చిక్కే. అంతేకాదు.. ప్రజాధనం పెద్ద ఎత్తున వృథా అవుతుంటుంది. అయినా ఈ ఒరవడి కొనసాగిస్తూనే ఉన్నారు మన నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: