ఏ రాజకీయ పార్టీ అయినా సరైన ప్రణాళిక, వ్యూహంతో ముందుకు వెళ్లాలి. లేకుంటే రాజకీయ పరంగా విజయం సాధించలేరు. గతంలో టీడీపీ తమ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు అధికార ప్రతినిధులు, సీనియర్ నేతలకు తటస్థుల ద్వారా శిక్షణ ఇప్పించేది. అంటే ఎలా మాట్లాడాలి.. ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.. డిబెట్స్లో ఎలా వాదించాలి.. ఆ సందర్భంలో ఎలాంటి పాయింట్లతో ముందుకు వెళ్లాలి అనే వాటిపై శిక్షణ ఇచ్చేది. ఇలా ఒక పద్ధతి ప్రకారం నడిచేది.


రాబోయే రోజుల్లో 2026 నాటికి కచ్ఛితంగా మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. ఆ లోపు జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన  పూర్తవుతుంది. జనాభా ప్రకారం ఎంపీల, ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది.  ఇందులో మహిళల ప్రాతినిధ్యం కచ్ఛితంగా పెరుగుతుంది. అంటే  రాజకీయాల్లోకి ప్రజా ప్రతినిధుల కుటుంబ నేపథ్యం కలిగిన వారు రావొచ్చు. లేక తటస్థులు, బడుగు బలహీన వర్గాలకు చెందని వారు, మైనార్టీలకు సంబంధించిన మహిళలు రావొచ్చు.  


ఇలా రావాలి అంటే, మహిళా నాయకురాళ్లుగా రాణించాలంటే పక్కా ప్రణాళిక అవసరం. అంటే ఇప్పటివరకు వీరి ప్రపంచం వేరు. ఇప్పటి నుంచి వేరు. ప్రస్తుతం టీవీలో రెచ్చిపోతున్న బూతులు, వ్యక్తిగత విమర్శలు ఈ తరహా కాకుండా మర్యాద పూర్వక భాషనే వాడాలి. లేదా ప్రస్తుత రాజకీయ పార్టీలుగా చెలామణి అవుతున్న వారైనా తమ పార్టీ మహిళా కార్యకర్తలకు  శిక్షణ ఇవ్వాలి.


నాయకురాళ్లుగా రాణించాలనుకునే వారికి ఒక వేదిక శిక్షణ కేంద్రం కావాలి. ఒక అంశాన్ని ఏ విధంగా వ్యక్తీకరించాలి. మీడియాను తమ వైపు ఎలా తిప్పుకోవాలి. పోరాటాలు ఎలా చేయాలి. దానిని న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలి. దానికి పరిష్కార మార్గం ఏ విధంగా చూపాలి వంటి అంశాలపై వీరికి శిక్షణ అవసరం. నిరంతరం పరిగెత్తే వ్యవస్థ రాజకీయం. దాంట్లో ఎలా వ్యవహరించాలి అనే అంశంపై ఆయా రాజకీయ పార్టీలు శిక్షణ ఇస్తే బాగుంటుంది అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: