ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు దిల్ రాజు. ఆయన బ్యానర్లో తెరకెక్కిన సినిమాలు మాత్రమే కాదు ఆయన డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాలు కూడా సూపర్ హిట్స్ అవుతాయని ఈ జనరేషన్ హీరోలు గట్టిగా నమ్ముతారు.
అందుకే యంగ్ జనరేషన్ హీరోలు తమ సినిమాల విషయంలో దిల్ రాజు హ్యాండ్ పడితే బాగుండని ఎదురుచూస్తుంటారు. దిల్ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన దిల్ రాజుకు తొలి సినిమా నుంచి ఆయన తమ్ముడు శిరీష్తో పాటు లక్ష్మణ్ కూడా కొనసాగుతున్నారు.
అయితే వీరిలో లక్ష్మణ్ విడిపోయేందుకు రెడీ అవుతున్నట్టుగా ఫిలిం సర్కిల్స్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఐదు నెలల క్రితమే లక్ష్మణ్ ఎస్వీసీ సంస్థ నుంచి బయటకు వచ్చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే లక్ష్మణ్ కొడుకు నిరంజన్ రెడ్డి నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు లైన్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాడు. భవిష్యత్తుల్లో పూర్తి స్థాయి నిర్మాతగా సొంత బ్యానర్లో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే దిల్ రాజు బ్యానర్ నుంచి బయటకు వచ్చేసినట్టుగా తెలుస్తోంది.
దిల్ రాజుకు శిరీష్ సొంత తమ్ముడు అందుకే ఆయన ఎప్పటికీ శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్లోనే కొనసాగుతాడని భావిస్తున్నారు. లక్ష్మణ్కు అలాంటి సంబంధాలేవి లేవు. దీంతో ఆయన సొంతగా నిర్మాణ సంస్థను నెలకొల్పేందుకు నిర్ణయం తీసుకున్నారు.
గతంలో 14 రీల్స్ బ్యానర్ను అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీ ఆచంటలు కలిసి ప్రారంభించారు. కానీ తరువాత అనిల్ సుంకర ఆ బ్యానర్ నుంచి బయటకు వచ్చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుంచి కూడా నిర్మాత మోహన్ బయటకు వచ్చేశాడన్న ప్రచారం జరుగుతోంది.