అవును! ఏపీలో ఏదో జరుగుతోంది! అది కూడా సీఎం చంద్రబాబు కేంద్రంగానే కీలకమైన వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా ముందుకు సాగుతోంది. వరుసగా జరుగుతన్న పరిణామాలు `ఏదో జరుగుతోంది` అని అనడానికి బలమైన ఆధారాలను కల్పిస్తున్నాయి. ప్రస్తుతం సీఎం చంద్రబాబు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై పోరు బావుటా ఎగురవేశారు. ఆయన ప్రతి అడుగూ.. మోడీతో ఢీ అంటే ఢీ అనే విధంగా సాగుతుందని ఇటీవల నిర్వహించిన ధర్మ పోరాట దీక్ష సందర్భంగా ఆయన బహిరంగంగానే వెల్లడించారు. దీంతో కేంద్రానికి-రాష్ట్రానికి మధ్య గ్యాప్ భారీ స్థాయిలో పెరిగిపోయింది.
ఇక, అదే రోజు.. చంద్రబాబు వియ్యంకుడు బాలయ్య.. మోడీని నానా తిట్లు తిట్టడం కూడా కేంద్రాన్ని చేరింది. ఈ పరిణామాలు ఇలా ఉంటే.. కేంద్రం ఏపీకి ఏదైనాసాయం చేయకపోగా.. తనదైన శైలిలో ఏదైనా అవాంతరం కానీ, అధికారికంగా ఏదైనా ఒత్తిడికానీ చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే కేంద్రం ఇంటిలిజెన్స్ బ్యోరో చీఫ్ సడన్ గా వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయి వెళ్ళారు. వీరి భేటీ గురించిన వివరాలేమీ బయటకు రాలేదు. అప్పట్లోనే ఈ విషయం ప్రముఖంగా పత్రికల్లో వచ్చింది. ఇక, ఇప్పుడు హఠాత్తుగా గవర్నర్ నరసింహన్ విజయవాడ చేరుకోవటం, ఆ వెంటనే సీఎం చంద్రబాబు వెళ్లి ఆయనను కలసి గంటన్నరపైగా సమావేశం కావటం వంటివి ఏదో జరుగుతోంది! అనే అంశాన్ని బలపరుస్తున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడటంతో పాటు.. కేంద్రం ఇచ్చిన నిధులను అడ్డగోలుగా వాడేసుకుని… దొంగ యూసీలు ఇవ్వటమే కాకుండా.. చంద్రబాబు అండ్ కో తమపై ఎదురుదాడి చేస్తున్న తీరుపై బీజేపీ పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నవిషయం తెలిసిందే. గత నాలుగేళ్ళ పాటు..ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా వదిలేసి.. కేంద్రం ఇస్తానన్న ప్యాకేజీకి జైకొట్టి, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యను ఘనంగా సన్మానించిన చంద్రబాబు ఇప్పడు యూటర్న్ తీసుకుని హోదా కోసం ఉద్యమం చేయడాన్ని బీజేపీ దళం జీర్ణించుకోలేక పోతోంది.
ఇక, తన పుట్టిన రోజునాడు చంద్రబాబు ధర్మదీక్ష పేరుతో సాగిన పోరులో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై బిజెపి నేతలు బాలకృష్ణను అరెస్టు చేయాలనే డిమాండ్ చేయటంతో పాటు.. కేసులు కూడా పెట్టారు. కేంద్రం కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేరుగా కేంద్రం రాష్ట్రంపై ప్రతీకార చర్యకు దిగుతోందా ? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఐబీ చీఫ్ వంటి వారు సాధారణంగా వచ్చి ఎవరితోనూ భేటీ కారు. మరి అలాంటి ఆయన ఇటీవల బాబుతో భేటీ కావడం సంచలనంగా మారింది. దీనిని బట్టి.. కేంద్రం.., చంద్రబాబుకు అటు ఐబీ చీఫ్ తోపాటు…గవర్నర్ నరసింహన్ తో స్పష్టమైన సంకేతాలేమైనా పంపిందా?
మాతో పెట్టుకుంటే.. అనే రేంజ్లో బెదిరింపులకు ఏమైనా దిగిందా? అనే చర్చ జరుగుతోంది. ఇక, ధర్మ దీక్షలో కూడా చంద్రబాబు తనపై కేసుల గురించి పదే పదే ప్రస్తావించటంతోపాటు..తాను మోడీ కాదు కదా..ఎవరికి భయపడను అని పలు మార్లు వ్యాఖ్యానించటం ఈ పరిణామాలకు బలాన్ని చేకూరుస్తోంది. మరి ఏం జరుగుతోంది ? అనే విషయం ఇప్పటికిప్పుడు వెల్లడి కాకపోయినా త్వరలోనే తేలిపోతుంది అంటున్నారు పరిశీలకులు. ఇక, ఇక్కడే మరో విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. నెల రోజుల కిందట ఢిల్లీలో మాట్లాడుతూ.. ``జైలుకు వెళ్లేదెవరో త్వరలోనే తేలుతుంది!`` అని నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెరమీదికి రావడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.