టీం ఇండియా మాజీ కెప్టెన్, భారత దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా జట్టుకి దూరంగా ఉన్నాడు ఈ దిగ్గజ ఆటగాడు. గత ఏడాది ప్రపంచకప్ సెమీ ఫైనల్ తర్వాత ధోనీ మళ్ళీ మ్యాచ్ ఆడలేదు. దీనితో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కూడా అతన్ని కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించింది. దీనితో ధోని క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
ఇక ఇప్పుడు ధోనీ... మళ్ళీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. తన సొంత ఊరు రాంచీలోని జేఎస్సీఏ క్రికెట్ స్టేడియంలో తరచు ప్రాక్టీస్ చేసే ధోని.. తాజాగా పిచ్ రోలర్ డ్రైవర్ అవతారమెత్తాడు. పిచ్ను ఎలా చదును చేయాలో అక్కడ ఉన్న వాళ్ళతో తెలుసుకున్న ధోని, తనకు అవకాశం దొరికిందే తడవుగా రోలర్ ఎక్కేసి పిచ్ను దున్నేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.
మార్చి 2వ తేదీ నుంచి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఐపియల్ ప్రాక్టీస్ లో పాల్గొంటాడు. అందుకోసం రాంచి స్టేడియం లో ధోని సిద్దమవుతున్నాడు. ఐపీఎల్-13 కోసం చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) ఇప్పటికే సన్నాహకాలను ప్రారంభించింది. ఇప్పటకే జట్టు కీలక ఆటగాళ్ళు సీనియర్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా, అంబటి రాయుడులతో పాటు మరికొంత మంది గత మూడు వారాలుగా ప్రత్యేక శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే.