అడవులను కాపాడుకోవాలి. అటవీ అగ్ని ప్రమాదాల నివారణలో చైతన్యవంతంగా వ్యవహరించాలి. అందుకే తెలంగాణ నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ పులుల అభయారణ్యం పరిధిలోని అచ్చంపేటలో తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ, ప్రపంచవ్యాప్త ప్రకృతి నిధి సంస్థ సంయుక్తంగా అటవీ అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తొలి దశలో అమ్రాబాద్, కవాల్ టైగర్ రిజర్వు పరిధిలో క్షేత్ర స్థాయిలో పనిచేసే అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణపై చక్కటి అవగాహన కల్పిస్తోంది.


అడవుల్లో రగిలే కార్చిచ్చు, యాజమాన్య పద్దతులు అనే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. అటవీ అగ్ని ప్రమాదాల విషయంలో సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్ర సామాగ్రి వాడకంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తున్నారు. నల్లమల అడవుల ప్రాంతాన్ని మెసిక్ సవాన్నాగా పిలుస్తారు. చెట్లు, విశాలమైన అందమైన పచ్చిక బయలు కలిగి ఉంటాయి. తక్కువ వర్షపాతం నమోదయ్యే ఆకురాల్చు అడవుల్లో మంచి పర్యావరణం ఉంటుంది. మానవ ప్రమేయం, ప్రాకృతిక కారణాల రీత్యా అటవీ అగ్ని ప్రమాదాలు రగులుతుంది. అడవుల్లో మంటలు అనేవి ప్రమాదకరం అయినప్పటికీ పరిమిత ప్రదేశంలో కంట్రోల్ బర్నింగ్ అడవికి ఉపయోగకరమేనట.  ఫలితంగా అడవుల్లో కొత్త జీవ వైవిధ్యం అభివృద్ధి చెందడంలో ఉపయోగపడుతుంది.


కార్చిచ్చు రగలగానే ఆందోళన చెందకూడదు. దశల వారీగా మంటలు అదుపుచేస్తూ అటవీశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి అధిక నష్టం వాటిల్లకుండా చేయచ్చు. అటవీ సమీప గ్రామాలు, ఆవాసాల్లో నివసించే వారిని నిత్యం అప్రమత్తం చేయాలి. అడవుల గుండా వెళ్లే రహదారుల్లో ప్రయాణీకులు ఆర్పని సిగరెట్, బీడీ విసరటం, వంటలు చేయటం లాంటివి నిరోధించడంపై సరైన అవగాహన కల్పించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: