తెలంగాణ లో కరోనా వైరస్ పూర్తి కట్టడిలోనే ఉన్నదన్న రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ , రాష్ర్టం లో కరోనా పరీక్షలు నిర్వహించడం లేదన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు . రాష్ర్టం లో కరోనా పరీక్షలే నిర్వహించడం లేదని గత కొన్ని రోజులుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి . ప్రభుత్వం కరోనా వైరస్ సోకిన వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నాయి . రాష్ర్టం లో కరోనా పరీక్షలు సరిగ్గా నిర్వహించడం లేదని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ కేంద్రానికి లేఖ రాశారు .
గాంధీ ఆసుపత్రి లో ఒక వృద్ధుడు కరోనా పరీక్షలు చేయించుకోగా ...ఫలితాల్లో నెగిటివ్ అని తేలిందని , అదే వృద్దుడు నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని సంజయ్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు . సదరు వృద్దుడు చికిత్స పొందుతూ కరోనా వ్యాధి కారణంగా మృతి చెందాడని ... అయినా రాష్ట్ర ప్రభుత్వం కరోనా మృతుల జాబితా లో ఆ వృద్ధుడి పేరు చేర్చలేదని అన్నారు . కరోనా పరీక్షలు సరిగ్గా చేయడం లేదని , మృతుల జాబితాను కూడా తగ్గించి చూపుతున్నారనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అని బండి సంజయ్ తన లేఖతో వెల్లడించారు .
అయితే విపక్షాలు చేస్తోన్న ఈ తరహా ఆరోపణల్లో వాస్తవం లేదన్న ఈటల , డయాలసిస్ రోగి అయిన 75 ఏళ్ల వృద్దుడు కూడా కరోనా నుంచి కోలుకుని క్షేమంగా ఇంటికి వెళ్లాడని తెలిపారు .ఇదంతా మన వైద్యుల కృషి అంటూ కితాబునిచ్చారు . తెలంగాణ లో కరోనా మరణాల రేటు తక్కువగా ఉండడానికి , కేసుల సంఖ్య తగ్గడానికి నిరంతర ప్రభుత్వ పర్యవేక్షణే కారణమని ఈటల అన్నారు .